
వేలంలో ఆచితూచి..
రూ.8.75 కోట్లతో ఐపీఎల్ 2023 మినీ వేలం బరిలోకి దిగిన ఆర్సీబీ ఆచితూచి వ్యవహరించింది. బిగ్ ప్లేయర్స్ బెన్ స్టోక్స్, సామ్ కరన్, కామెరూన్ గ్రీన్, హరీ బ్రూక్, మయాంక్ అగర్వాల్ కోసం ప్రయత్నించినా.. ఆర్సీబీ బడ్జెట్కు చేజిక్కించుకోలేకపోయింది. దాంతో బ్యాకప్ బౌలర్లపై ఫోకస్ పెట్టిన ఆర్సీబీ ఆచితూచి.. రీస్ తోప్లే, విల్ జాక్స్లను కొనుగోలు చేసింది. రజన్ కుమార్, అవినాష్ సింగ్, సోనూ యాదవ్, మనోజ్ బండగే, హిమన్షు శర్మలను జట్టులోకి తీసుకుంది. అయితే జిల్లా స్థాయి క్రికెట్ కూడా ఆడని హిమాన్షు శర్మను ఆర్సీబీ కొనుగోలు చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

దేశవాళీ క్రికెట్ కూడా ఆడని..
సయ్యద్ ముస్తాక్ ఆలీ, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీతో పాటు తమిళనాడు టీ20 లీగుల్లో సత్తా చాటిన ప్లేయర్లను ఏరికోరి ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయి. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపి రికార్డులు తిరగరాసిన సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్లకు ఐపీఎల్లో నిరాశే ఎదురవుతోంది.
అయితే హిమాన్షు శర్మ ఇప్పటి దాకా ఏ రాష్ట్ర టీమ్కి కానీ జిల్లా టీమ్కి కానీ ఆడలేదు. అయితే హిమాన్ష్ శర్మను తీసుకోవడానికి గల కారణాన్ని ఆర్సీబీ స్కౌటింగ్ టీమ్ హెడ్ మలోలన్ రంగరాజన్ వెల్లడించాడు.

ఆర్సీబీ టాలెంట్ స్కౌట్ గుర్తించిన ప్లేయర్..
'హిమాన్షు చాలా అద్భుతమైన టాలెంట్ ఉన్న ప్లేయర్. దేశవాళీ టోర్నీల్లో అతను ఇంకా ఆడలేదు. ఆర్సీబీ టాలెంట్ స్కౌటింగ్ టీమ్, హిమాన్షుని వెతికి వెలికి తీసింది. ఏడాది క్రితమే హిమాన్షుని చూశాం. అతన్ని గమనిస్తూ వస్తున్నాం. అందుకే అతను మా టీమ్లో ఉంటే బాగుంటుందని తీసుకున్నాం.
ఆర్సీబీలో మంచి కోచ్లు ఉన్నారు. ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నారు. వీరి నుంచి హిమాన్షు ఎంత నేర్చుకుంటాడు. ఎలా రాటుతేలడనేది అతని చేతుల్లోనే ఉంది. రాజస్థాన్ నుంచి వచ్చిన ఈ కుర్రాడు, ప్రస్తుతం క్లబ్ లెవెల్ క్రికెట్ ఆడుతున్నాడు.
ఇప్పటికైతే దేశవాళీ టోర్నీ ఆడకపోయినా తన టాలెంట్ను ఎలా వాడుకోవాలో ఆర్సీబీకి అవగాహన కుదిరింది.. అతన్ని మ్యాచ్ విన్నర్గా మలచడమే మా ముందున్న లక్ష్యం.' అని రంగరాజన్ చెప్పుకొచ్చాడు.

వెయ్యి కళ్లతో...
కనీసం జిల్లా స్థాయి క్రికెట్ కూడా ఆడని తనను ఆర్సీబీ కొనుగోలు చేసిందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హిమాన్షు శర్మ తెలిపాడు. 'నేను ఇప్పటిదాకా ఏ స్టేట్ టీమ్కు ఆడలేదు. ఏ కాంపీటీషన్లో పాల్గొనలేదు, కనీసం జిల్లా టీమ్కి కూడా ఆడలేదు.
అలాంటి నన్ను ఆర్సీబీ సెలక్ట్ చేసుకుంది. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నా... విరాట్ కోహ్లీ నా క్రికెట్ ఐడెల్. ఆర్సీబీ క్యాంపులో ఆయన్ని కలవడానికి వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నా.
మహమ్మద్ సిరాజ్, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ వంటి ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోబోతున్న.. అనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను 'అని 24 ఏళ్ల లెగ్ స్పిన్నర్ హిమాన్షు శర్మ తెలిపాడు.
హిమాన్షు బంతిని రెండు వైపులా టర్న్ చేయగలడు. ఇక అతని కనీస ధర రూ.20 లక్షలకు ఆర్సీబీ తీసుకుంది. అయితే ఈ ఎంపికను దొడ్డ గణేశ్ వంటి మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications
