హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్.. అభిమానుల అంచనాలకు తగ్గట్లే సాగుతోంది. హోరాహోరీ మ్యాచ్లు.. కళ్లు చెదిరే క్యాచ్లు.. స్డేడియం పైకప్పును తాకే సిక్సర్లు అభిమానులను కనువిందు చేస్తున్నాయి. గత శుక్రవారం ప్రారంభమైన ఈ క్యాష్ రిచ్ లీగ్లో 10 జట్లు ఇప్పటికే ఒక్కొక్క మ్యాచ్ ఆడాయి. ఐదు జట్లు విజయం సాధిస్తే మరో ఐదు జట్లు ఓటమిపాలయ్యాయి.
అయితే వేలంలో కోట్లు పలికిన ఆటగాళ్లు.. పోటుగాళ్లు ఆటలో అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. భారీ అంచనాలను అందుకోలేకపోయారు. అనామక ఆటగాళ్లు మాత్రం అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వేలంలో కోట్లు పలికిన పోటుగాళ్ల పెర్ఫామెన్స్పై ఓ లుక్కెద్దాం.

13 కోట్లు 13 పరుగులు: ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఇంగ్లండ్ బ్యాటర్ హరీ బ్రూక్ను రూ.13.25 కోట్ల భారీ ధరకు సన్రైజర్స్ కొనుగోలు చేసింది. ఈ సీజన్లో తమ ఆశాధీపం అతనేనని ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్తో పాటు పక్కనే ఉన్న పాక్ లీగ్ పీఎస్లో సత్తా చాటడంతో సన్రైజర్స్కు తిరుగుండదని అంతా అనుకున్నారు. కానీ రాజస్థాన్ రాయల్స్తో సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్లో బ్రూక్ దారుణంగా విఫలమయ్యాడు. 21 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. దాంతో కోటికి ఒక పరుగు చొప్పున 13 రన్స్ చేశాడని ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు.
రూ. 17 కోట్లు దండుగ: ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం ముంబై ఇండియన్స్ రూ.17 కోట్లు ఖర్చు చేసింది. ఆల్రౌండరనే ఉద్దేశంతో వేలంలో పోటీపడి మరీ తీసుకుంది. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్లో అతను మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్లో ఐదు పరుగులు మాత్రమే చేసిన గ్రీన్.. బౌలింగ్లో ఓ వికెట్ తీయకపోగా.. రెండు ఓవర్లలో 30 రన్స్ ఇచ్చుకున్నాడు.
బెన్ స్టోక్స్ కూడా: చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్, ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. వేలంలో రూ.16.25 కోట్ల భారీ ధరకు చెన్నై అతని కొనుగోలు చేయగా.. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో అతను 7 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. మొకాలి గాయంతో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్గానే కొనసాగుతున్నాడు.
సామ్ కరన్ ఒక్కడే: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరణ్ ఒక్కడే స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాడు. రూ.18.25 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేయగా.. కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో బ్యాటింగ్లో 26 పరుగులు చేశాడు. బౌలింగ్లో 4 ఓవర్లలో 38 పరుగులిచ్చి ఓ వికెట్ తీసాడు. భారీ ప్రైజ్ ట్యాగ్ ప్లేయర్లు అయిన కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. దాంతో కోట్ల రూపాయల ఆటగాళ్లు దండుగని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.