న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ తుది దశకు చేరిన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గొప్ప పనికి శ్రీకారం చుట్టింది. 'గో గ్రీన్' కార్యక్రమంలో భాగంగా ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో బౌలర్లు వేసే ప్రతీ డాట్ బాల్కు 500 మొక్కలు నాటుతామని ప్రకటించింది. క్వాలిఫయర్-1 నుంచి ఫైనల్ వరకు ఎన్ని డాట్ బాల్స్ పడితే అన్ని 500 మొక్కలు నాటనుంది.
ఈ క్రమంలోనే అధికారిక బ్రాడ్కాస్టర్స్ జియో సినిమా, స్టార్ స్పోర్ట్స్.. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో డాట్ బాల్కు బదులు చెట్టు సింబల్ను చూపించాయి. బీసీసీఐ చేపట్టిన ఈ పనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. గొప్ప పనని, ఇన్నాళ్లకు బీసీసీఐకి మంచి చేయాలనే ఆలోచన రావడం బాగుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

మరికొందరు మాత్రం ఫన్నీ మీమ్స్, సెటైరికల్ ట్వీట్స్తో నవ్వులు పూయిస్తున్నారు. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్లో బ్యాటింగ్ను ప్రస్తావిస్తూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేశారు. టీ20ల్లో టెస్ట్ బ్యాటింగ్ ఆడే కేఎల్ రాహుల్ ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే.. బీసీసీఐ నల్లమల ఫారెస్ట్ నాటాల్సి వచ్చేదని సెటైర్లు పేల్చారు.
ఈ సీజన్లో రాహుల్ నాలుగు ఓవర్లను మెయిడిన్ చేశాడు. అనంతరం తొడకండరాల గాయంతో జట్టుకు దూరం కాగా.. కృనాల్ పాండ్యా సారథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాహుల్ లేనిదే మంచిదైందని, లేకుంటే బీసీసీఐ అడవులను నాటాల్సి వచ్చేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంకొందరు మాత్రం రాహుల్ ఉంటే.. లక్నో ప్లే ఆఫ్స్ వరకు కూడా వచ్చేది కాదని కామెంట్ చేశారు.
ఇంకొందరు మాత్రం రాహుల్ వల్ల జట్టుకు ఉపయోగం లేకపోయినా.. వేల మొక్కలు నాటించి పర్యావరణానికి ఎంతో మేలు చేసేవాడని అభిప్రాయపడ్డారు. మరికొందరు సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాల్సిందని, అప్పుడు బీసీసీఐ మొక్కలు నాటేందుకు తమ ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చేదని సెటైర్లు పేల్చారు.
చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్లో మొత్తం 84 డాట్ బాల్స్ నమోదయ్యాయి. అంటే ఒక్కో డాట్ బాల్కి 500 మొక్కల చొప్పున మొత్తంగా 42 వేల మొక్కలను బీసీసీఐ నాటనుంది. ఈ లెక్కన ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్ కలిపి సుమారు రెండున్నర లక్షల మొక్కలను బీసీసీఐ నాటే అవకాశం ఉంది.