
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. డిసెంబర్ 30న సొంతంగా డ్రైవ్ చేస్తున్న అతని కారు డివైడర్ను ఢీకొట్టి పూర్తి దగ్దమైంది. ఈ ఘోర ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన రిషభ్ పంత్.. తీవ్ర గాయాలతో ఇంటికే పరిమితమయ్యాడు. సుమారు రెండేళ్ల పాటు అతను మైదానానికి దూరంగా ఉండనున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2023 సీజన్తో పాటు వన్డే ప్రపంచకప్ కూడా పంత్ మిస్సవ్వనున్నాడు.
రిషభ్ పంత్ గైర్హాజరీ ఢిల్లీ క్యాపిటల్స్కు తీవ్ర నష్టం చేసింది. ఇక పంత్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఎవర్నీ భర్తీ చేయలేదు. పంత్లాంటి వికెట్ కీపర్ బ్యాటర్ కోసం ఢిల్లీ అన్వేషిస్తూనే ఉంది. పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్తో బలంగా కనిపిస్తున్న ఢిల్లీకి వికెట్ కీపర్ ఒక్కడే లోటుగా మారాడు. అయితే పంత్ స్థానంలో దేశవాళీ స్టార్, కేరళ ప్లేయర్ మహమ్మద్ అజారుద్దీన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పంత్ స్థానానికి అతనే సరిపోతాడని టీమ్మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి.
గత సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి ప్రాతినిథ్యం వహించిన మహ్మద్ అజారుద్దీన్.. ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశాన్ని అందుకోలేకపోయాడు. దాంతో ఐపీఎల్ 2023 మినీ వేలంలో అజారుద్దీన్ ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. దేశవాలీ టీ20 క్రికెట్లో ఇప్పటి వరకు 39 మ్యాచ్ లు ఆడిన మహమ్మద్ అజారుద్దీన్.. 741 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చి విధ్వంసం సృష్టించగల సత్తా అజారుద్దీన్కు ఉంది. ఈ క్రమంలోనే పంత్ ప్లేస్ను అజారుద్దీన్తో భర్తీ చేయాలని ఢిల్లీ టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ యువ వికెట్ కీపర్.. ఢిల్లీకి పంత్ లేని లోటును తీరుస్తాడో లేదో చూడాలి.