హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు మరో ఓటమి ఎదురైంది. కోల్కతా నైట్రైడర్స్తో గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో పేలవ బ్యాటింగ్తో సన్రైజర్స్ సునాయసంగా గెలిచే మ్యాచ్ను చేజార్చుకుంది. 6 బంతుల్లో 9 పరుగులు చేయలేక ఓటమికి తల వంచింది. ఈ ఓటమి నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పేరు మరోసారి చర్చనీయాంశమైంది.
ఈ మ్యాచ్కు హాజరైన ఆమె స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. మైదానంలో తన హావ భావాలతో అందర్నీ ఆకట్టుకుంది. వికెట్ కోల్పోయినప్పుడు బాధపడి.. బౌండరీలు బాదినప్పుడు ఎగిరి గంతేసింది. ముఖ్యంగా మ్యాచ్ చివర్లో ఆమె చేసిన సందడి నెట్టింటిని షేక్ చేస్తోంది.

సన్రైజర్స్ విజయానికి 12 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన సమయంలో వైభవ్ అరోరా వేసిన 19వ ఓవర్లో మార్కో జాన్సెన్(1) కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో సన్రైజర్స్ అభిమానులతో పాటు కావ్య మారన్ కూడా తీవ్ర నిరాశకు గురైంది. అయితే క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ ఓ బౌండరీ బాదడం, ఆ వెంటనే నోబాల్ను అబ్దుల్ సమద్ మరో బౌండరీ కొట్టడంతో కావ్య మారన్ సంతోషానికి హద్దే లేకుండా పోయింది.
ఎగిరి గంతేసిన కావ్య పాప.. గట్టిగా అరిచింది. విజయం మాదే అంటూ ధీమా వ్యక్తం చేసింది. కానీ చివరి ఓవర్లో వరుణ్ చక్రవర్తీ.. కీలక అబ్దుల్ సమద్ను ఔట్ చేయడంతో పాటు 3 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఓటమిపాలైంది. దాంతో కావ్య మారన్ ముఖం కూడా చిన్నబోయింది. అంతకుముందు హెన్రీచ్ క్లాసెన్ బాదిన 102 మీటర్ల సిక్స్కు నోరెళ్లబెట్టింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి నేపథ్యంలో అభిమానులు కావ్య మారన్పై ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
ఆమె ఎక్స్ప్రెషన్స్ను షేర్ చేస్తూ.. మా కావ్య పాపకు వచ్చిన కష్టం పగోడికి కూడా రావద్దని కామెంట్ చేస్తున్నారు. కావ్య పాప ముఖంలో నవ్వు లేకుండా చేస్తున్నారు కదరా..? అంటూ ఆటగాళ్లపై మండిపడుతున్నారు. కావ్య పాప బాధపడటం తాము తట్టుకోలేకపోతున్నామని, దయచేసి గెలవాలని ఆటగాళ్లను రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్లో కావ్య మారన్ పేరు ట్రెండ్ అవుతోంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 42), రింకూ సింగ్(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 46) రాణించారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, మార్కో జాన్సెన్ రెండేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగీ, ఎయిడెన్ మార్క్రమ్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్(40 బంతుల్లో 4 ఫోర్లతో 41), హెన్రీచ్ క్లాసెన్(20 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 36) రాణించినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తీ మూడు పరుగులు మాత్రమే ఇచ్చి కేకేఆర్ను గెలిపించాడు.