అహ్మదాబాద్: క్రికెట్ చరిత్రలోనే జియో సినిమా సంచలనం సృష్టించింది. ఆల్టైమ్ రికార్డ్ వ్యూస్తో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అనూహ్యంగా ఐపీఎల్ ఓటీటీ రైట్స్ను దక్కించుకున్న జియో సినిమా.. ఫ్రీగా తమ సేవలను అందిస్తూ కోట్లాది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.
ఇప్పటికే అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్గా డిజిటల్ ప్రపంచంలో సరికొత్త రికార్డు నెలకొల్పిన జియో సినిమా.. వ్యూయర్ షిప్ విషయంలోనూ గత రికార్డులన్నిటినీ బద్దలు కొట్టింది.

చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆల్టైమ్ రికార్డు వ్యూయర్షిప్ను జియో సినిమా నమోదు చేసింది. ఈ మ్యాచ్ను జియో సినిమా యాప్ వేదికగా గరిష్టంగా 3 కోట్ల 20 లక్షల మంది వీక్షించారు. క్రికెట్ డిజిటల్ ప్రసారాల్లోనే ఇది ఆల్టైమ్ రికార్డు.
2019 వన్డే ప్రపంచకప్లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ను హాట్ స్టార్ వేదికగా రూ.2.53 కోట్ల చూశారు. ఇదే హయ్యెస్ట్ వ్యూయర్షిప్గా ఉండగా.. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్తో ఈ రికార్డును జియో సినిమా అధిగమించింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ సందర్భంగా 3.2 కోట్ల మంది వీక్షిస్తే.. ధోనీ బ్యాటింగ్కు వస్తే ఈ సంఖ్య 4 కోట్లకు చేరే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన సాయి సుదర్శన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. వృద్దిమాన్ సాహా(39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు.

శుభ్మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 39), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. చెన్నై బౌలర్లలో పతీరణ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ తలో వికెట్ తీసారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్య చేధనకు దిగగా.. మూడు బంతులు వేయగానే వర్షం వచ్చింది. దాంతో అంపైర్లు ఆటను ఆపేసారు.
వర్షం ఆగినా.. భారీగా పడటంతో మైదానం చిత్తడిగా మారింది. సిబ్బంది ఆటకు అనువుగా మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడితే డక్వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని తేల్చే అవకాశం ఉంటుంది. మ్యాచ్ జరగకపోతే గుజరాత్ టైటాన్స్ను విజేతగా ప్రకటించనున్నారు.