న్యూఢిల్లీ: గుజరాత్ టైటాన్స్ యువ ప్లేయర్ సాయి సుదర్శన్పై ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసల జల్లు కురిపించాడు. మరో రెండేళ్లలో సాయి సుదర్శన్ టీమిండియా సూపర్ స్టార్గా ఎదుగుతాడని జోస్యం చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్ష్యచేధనలో పవర్ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన గుజరాత్ టైటాన్స్ను సాయి సుదర్శన్ ఆదుకున్నాడు.
48 బంతుల్లో అజేయంగా 62 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం తమ విజయంపై మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. సాయి సుదర్శన్ను మెచ్చుకున్నాడు. అతను ఇలాగే ఆడితే మరో రెండేళ్లలో టీమిండియా స్టార్గా ఎదుగుతాడని కొనియాడాడు.

'సాయి సుదర్శన్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అతనికి, సహాయక సిబ్బందికి ఈ విజయం క్రెడిట్ దక్కుతుంది. అతను గత 15 రోజుల్లో చేసిన బ్యాటింగ్ ప్రదర్శన అతని కష్టానికి ప్రతిఫలం. అతను ఇలాగే చెలరేగితే.. నా అంచనా తప్పుకాకపోతే.. మరో రెండేళ్లలో ఫ్రాంచైజీ క్రికెట్లో గొప్ప ప్లేయర్ అవుతాడు. టీమిండియాకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి' అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
తొలి మ్యాచ్లో కేన్ విలియమ్సన్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు వచ్చిన సాయి సుదర్శన్ 22 పరుగులు చేశాడు. ఢిల్లీతో మ్యాచ్లో అలవోకగా షాట్లు ఆడి బౌలర్లపై ఒత్తిడిని పెంచాడు. సుదర్శన్ను వేలంలో గుజరాత్.. కనీస ధర రూ.20 లక్షలకే సొంతం చేసుకుంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో సాయి సుదర్శన్కు మంచి రికార్డులున్నాయి.
గుజరాత్ టైటాన్స్ సమష్టి ప్రదర్శనతోనే విజయాలందుకుంటుంది. గతేడాది కూడా జట్టులో మ్యాచ్కు ఒక ప్లేయర్ విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇవ్వగా.. ఈ సీజన్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన ఆ జట్టు తదుపరి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. ఆదివారం(ఎప్రిల్ 9)న అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.