న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో దుమ్మురేపిన కుర్రాళ్లు భవిష్యత్తులో టీమిండియాకు ఆడుతారని దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జోస్యం చెప్పాడు. సెంచరీల మోత మోగించిన యశస్వీ జైస్వాల్తో పాటు ఫినిషర్గా అందరి ప్రశంసలు అందుకున్న రింకూ సింగ్ సమీప భవిష్యత్తులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తారని అంచనా వేసాడు.
ఈ ఇద్దరితో పాటు తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా టీమిండియాలో కీలకమవుతారని తెలిపాడు. శుభ్మన్ గిల్కు టీమిండియా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హిందూస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. శుభ్మన్ గిల్ అందికంటే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

'బ్యాటింగ్ గురించి మాత్రమే మాట్లాడుకుంటే.. శుభ్మన్ గిల్ ప్రదర్శన అద్భుతం. అతడిలానే యశస్వి జైస్వాల్ కూడా భారత భవిష్యత్ క్రికెట్కు కీలకమవుతాడు. తప్పకుండా యశస్వి టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడని అనిపిస్తోంది. ఇప్పటికే శుభ్మన్ గిల్ జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. ఏదొక రోజు కెప్టెన్ అయ్యే అవకాశాలు అతనికి ఉన్నాయి.
ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇది జరుగుతుందని చెప్పడం లేదు. కానీ భవిష్యత్తులో స్టార్ క్రికెటర్లుగా ఎదుగుతారనే నమ్మకం ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్ ఓటమి తర్వాత కొత్త జట్టును తయారు చేసుకోవాలనే సూచనలు చాలా వచ్చాయి. యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్తో పాటు తిలక్ వర్మ, రింకు సింగ్లకు కూడా భారత జట్టులో చోటు దక్కుతుంది.
అందుకోసం నేను యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ను సిద్ధం చేశా. బ్యాటర్ల జాబితాను పరిశీలిస్తే.. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, తిలక్ వర్మలు ఉంటారు. ఈ యువ బ్యాటింగ్ విభాగానికి హార్దిక్ పాండ్య కెప్టెన్గా ఉండాలి.'' అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ 2023 సీజన్లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరుకోగా.. మరో బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు ఫైనల్లో సీఎస్కేతో తలపడనుంది. శుభ్మన్ గిల్ టాప్ స్కోరర్గా ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు.