న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 10 జట్లు ఎనిమిదేసి మ్యాచ్లు ఆడగా.. ప్లే ఆఫ్స్ చేరే జట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రతీ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ను చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించడంతో ప్లే ఆఫ్స్ చేరే జట్లను అంచనా వేయడం కష్టంగా మారింది. చివరి రెండు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్కు కూడా ఇంకా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
అయితే ఐపీఎల్ 2023 సీజన్లో ప్లే ఆఫ్స్ చేరే నాలుగు జట్లను మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంచనా వేసాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా బోల్డ్ ప్రెడిక్షన్ను ప్రకటించాడు. 'ఈసారి ప్లేఆఫ్స్ చేరే జట్లను అంచనా వేయడం కాస్త కష్టమైన పనే. అయితే గుజరాత్ టైటాన్స్ ఆడుతున్న విధానం చూస్తుంటే.. డిఫెండింగ్ ఛాంపియన్ మరోసారి ప్లేఆఫ్స్ చేరేలా కనిపిస్తోంది. సమష్టిప్రదర్శనలతో విజయాలు అందుకుంటున్న నేపథ్యంలో వాళ్లు ప్లేఆఫ్స్ చేరేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.

ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ కూడా సూపర్ ఫామ్లో ఉంది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. జట్టు నిండా మ్యాచ్ విన్నర్లు ఉండటంతో పాటు ధోనీకి ఇదే చివరి సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ జట్టు కచ్చితంగా టైటిల్ గెలవాలనుకుంటుంది.
వరుసగా రెండు మ్యాచ్ల్లో 200 పరుగుల లక్ష్యాన్ని చేధించిన ముంబై ఇండియన్స్ కూడా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి వస్తే ఆ జట్టుకు తిరుగుండదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఆ టీమ్లో నలుగురే ఆడుతున్నా.. జోష్ హజెల్వుడ్ రాకతో ఆర్సీబీ బలం పెరిగింది. రాజస్థాన్ రాయల్స్ కూడా రేసులో ఉన్నా.. మిగతా జట్లు వెనక్కినెట్టే అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ను వెనక్కునెట్టి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖారారు చేసుకుంటుంది.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ను హర్భజన్ సింగ్ పట్టించుకోలేదు. అంతేకాకుండా ఏడో స్థానంలో ఉన్న ముంబై, ఐదో స్థానంలో ఉన్న ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరతాయని చెప్పిన హర్భజన్ సింగ్.. నాలుగో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, రెండో స్థానంలో ఉన్న లక్నో ప్లే ఆఫ్స్ చేరడం కష్టమని చెప్పడం గమనార్హం.