అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ప్రారంభించింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం జరిగిన సీజన్ ఓపెనర్ మ్యాచ్లో సమష్టిగా విఫలమైన చెన్నై 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముందు బ్యాటింగ్ వైఫల్యంతో భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్న చెన్నై.. తర్వాత పేలవ బౌలింగ్తో గెలిచే మ్యాచ్లో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్లతో 92) ఒక్కడే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో ధోనీ(14 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ రెండేసి వికెట్లు తీయగా.. జోష్ లిటిల్ ఓ వికెట్ తీసాడు.

అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శుభ్మన్ గిల్(36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. రషీద్ ఖాన్(10 నాటౌట్), రాహుల్ తెవాటియా(15 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. చెన్నై బౌలర్లలో హంగార్గేక్కర్ మూడు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్పాండే, జడేజా తలో వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్లో 20 పరుగులు తక్కువగా చేయడం.. బౌలింగ్లో 19వ ఓవర్లో దీపక్ చాహర్ 15 పరుగులివ్వడం చెన్నై విజయవకాశాలను దెబ్బతీసింది.
179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు వృద్దిమాన్ సాహా(16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 25), శుభ్మన్ గిల్ శుభారంభం అందించారు. ధాటిగా ఆడుతున్న సాహాను హంగార్గేకర్ పెవిలియన్ చేర్చగా.. కేన్ విలియమ్సన్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన సాయి సుదర్శన్తో శుభ్మన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది.
క్రీజులో ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ధోనీ.. హంగార్గేకర్ సాయంతో విడదీసాడు. సాయి సుదర్శన్(22)ను ఊరించే ఔట్ సైడ్ ఆఫ్ స్టెంప్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. మరోవైపు శుభ్మన్ గిల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(8)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ కొద్దిసేపటికే తుషార్ దేశ్పాండే బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన శుభ్మన్ గిల్.. క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఈ బంతికి ముందే బౌండరీ లైన్ వద్ద వచ్చిన క్యాచ్ను రుతురాజ్ అందుకోలేకపోయాడు. కానీ రెండోసారి ఆ తప్పు చేయలేదు. 17వ ఓవర్లో దీపక్ చాహర్ నాలుగు పరుగులే ఇవ్వడంతో గుజరాత్ విజయానికి చివరి 18 బంతుల్లో 30 పరుగులు అవసరమయ్యాయి.
అయితే హంగర్గేకర్ వేసిన 18వ ఓవర్లో తెవాటియా భారీ సిక్సర్ బాదగా.. విజయ్ శంకర్ చివరి బంతికి ఔటయ్యాడు. 19వ ఓవర్లో రషీద్ ఖాన్ వరుసగా 6, 4 బాది 15 పరుగులు పిండుకోవడంతో సీఎస్కే విజయానికి ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరమయ్యాయి. తుషార్ దేశ్పాండే వేసిన ఆఖరి ఓవర్లో తెవాటియా భారీ సిక్స్, బౌండరీ బాది విజయా లాంఛనాన్ని పూర్తి చేశాడు.