హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణంగా విఫలమైంది. పేలవ ప్రదర్శనతో వరుస పరాజయాలు అందుకున్న ఢిల్లీ.. పాయింట్స్ టేబుల్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. జట్టు నిండా స్టార్లు ఉన్నా.. విజయాలు అందుకోలేకపోయింది. సీజన్ ప్రారంభానికి ముందే ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురవ్వడం కోలుకోలేని దెబ్బతీసింది.
డేవిడ్ వార్నర్కు సారథ్య బాధ్యతలు అప్పగించినా.. టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. పంత్ గైర్హాజరీలో సరైన వికెట్ కీపర్ కోసం టీమ్మేనేజ్మెంట్ చేసిన ప్రయోగాలన్నీ బెడిసికొట్టాయి. సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ పోరెల్లను వికెట్ కీపర్గా ఆడించినా.. వర్కౌటవ్వలేదు. యువ ఓపెనర్ పృథ్వీ షా ఘోర వైఫల్యం కూడా ఢిల్లీ విజయవకాశాలు దెబ్బతీసింది.

మొత్తం 8 మ్యాచ్లే ఆడిన పృథ్వీ షా.. ఓ హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులే చేశాడు. ఆ హాఫ్ సెంచరీ కూడా చివరగా ఢిల్లీ 13వ మ్యాచ్లో చేశాడు. పృథ్వీ షా వైఫల్యం.. టీమ్ బ్యాటింగ్పై తీవ్ర ప్రభావం చూపింది. డేవిడ్ వార్నర్తో పాటు మిచెల్ మార్ష్, మనీశ్ పాండేలపై ఒత్తిడి నెలకొల్పింది. మిచెల్ మార్ష్ సైతం ఆరంభ మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు.
ఫిల్ సాల్ట్ను తుది జట్టులోకి వచ్చిన తర్వాత ఢిల్లీ కాస్త మెరుగైన ప్రదర్శన చేసింది. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ దారుణంగా విఫలమయ్యాడు. ఇషాంత్ శర్మ, యశ్ దూల్, అక్షర్ పటేల్ పర్వాలేదనిపించినా.. సమష్టి ప్రదర్శన కరువైంది. లీగ్ ఫస్టాఫ్లో ఏడు మ్యాచ్లకు వరుసగా ఐదు ఓడిన ఢిల్లీ.. సెకండాఫ్లో మరో నాలుగు మ్యాచ్లో ఓటమిపాలైంది.
14 మ్యాచ్ల్లో 5 గెలిచి పాయింట్స్ టేబుల్లో చివరిస్థానంలో నిలవకుండా 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఘోర పరాభవం నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ప్రక్షాళనకు దిగింది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్కు తమ రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా బరిలోకి దిగే అవకాశం ఉండటంతో టీమ్కు భారమైన ఆటగాళ్లపై వేటు వేసేందుకు రెడీ అయ్యింది.
ఈ ఏడాది డిసెంబర్లో ఐపీఎల్ 2024 సీజన్ వేలం జరగనుంది. ఈ మినీ వేలానికి ఢిల్లీ పకడ్బందీగా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసింది. దారుణంగా విఫలమైన పృథ్వీ షాతో పాటు మనీశ్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అభిషేక్ పోరెల్, ప్రియాబ్ గార్గ్లను రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాలో చేర్చింది. వీరితో పాటు డేవిడ్ వార్నర్, ఇషాంత్ శర్మలను కూడా ఢిల్లీ వదులుకునే అవకాశం ఉంది.
ఇషాంత్ వయసు పైబడగా.. డేవిడ్ వార్నర్ ఒకప్పటిలా ఆడలేకపోతున్నాడు. అంతేకాకుండా 2024 టీ20 వరల్డ్ కప్తో రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పాడు. ఫామ్లో ఉంటేనే అప్పటి వరకు కొనసాగుతానని, లేకుంటే ముందుగానే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే వార్నర్ను కూడా రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాలో ఢిల్లీ చేర్చింది.
మినీ వేలం జరిగే వరకు వీరి పెర్ఫామెన్స్ను నిశితంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది.