హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ దారుణంగా విఫలమైంది. పడుతూ లేస్తూ సాగిన ఆ జట్టు ప్రయాణం చివరకు ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ముగిసింది. 14 మ్యాచ్ల్లో 6 విజయాలు మాత్రమే నమోదు చేసిన కేకేఆర్ 12 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. రింకూ సింగ్ సెన్సేషనల్ బ్యాటింగ్ మినహా కేకేఆర్ అభిమానులకు సంతోషాన్నిచ్చే అంశం ఒక్కటి కూడా లేదు.
పేలవ బ్యాటింగ్తో పాటు సమష్టి వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది. రింకూ సింగ్ పుణ్యమా కేకేఆర్ కనీసం ఆ విజయాలైనా నమోదు చేసింది. లీగ్ ప్రారంభానికి ముందే కేకేఆర్కు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెన్నుముక గాయంతో టోర్నీ మొత్తానికి దూరం కాగా.. నితీశ్ రాణా జట్టును నడిపించాడు.

కెప్టెన్గా నితీశ్ పర్వాలేదనిపించినా.. స్టార్ ఆటగాళ్ల వైఫల్యం జట్టు ఓటములకు కారణమైంది. ముఖ్యంగా ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, లిటన్ దాస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దాంతో కోల్కతా తరుచూ టీమ్ కాంబినేషన్ను మార్చింది. యవ ఆటగాళ్లు నారయణ్ జగదీషన్, మన్దీప్ సింగ్లు కూడా దారుణంగా విఫలమయ్యారు.
కెప్టెన్ నితీశ్ రాణా ఒకటి రెండు మ్యాచ్లు మినహా పెద్దగా రాణించిందేం లేదు. రెహ్మానుల్లా గుర్భాజ్ సైతం పరుగులు చేయలేకపోయాడు. వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తీలు మాత్రమే టాప్ పెర్ఫామెన్స్ కనబర్చారు. తమ అకాడమీ ప్లేయర్, ఔట్ ఆఫ్ సిలబస్ స్పిన్నర్ అయిన సుయాశ్ శర్మ సైతం ఆకట్టుకున్నాడు. దేశవాళీ క్రికెట్ అనుభవం కూడా లేని సుయాశ్ శర్మ నేరుగా ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు.
ఇప్పటికే ఈ సీజన్ వైఫల్యాలపై ఫోకస్ పెట్టిన కేకేఆర్ మెనేజ్మెంట్ జట్టుకు పనికిరాని ఆటగాళ్లను వదిలించుకునేందుకు సిద్దమైంది. జట్టుకు అవసరం లేని ఆటగాళ్ల జాబితాను రూపొందించుకున్న మేనేజ్మెంట్ .. ఇక నుంచి వారి ఆటతీరు, ఫామ్ను నిశితంగా పరిశీలించనుంది.
ఆండ్రీ రస్సెల్ ఇదే పేలవ ఫామ్ కొనసాగిస్తే అతనిపై కూడా వేటు వేయనుంది. అతనితో పాటు సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, లూకీ ఫెర్గూసన్, మన్దీప్ సింగ్, లిటన్ దాస్, నారయణ్ జగదీషన్, కుల్వంత్ ఖెజ్రోలియాలను కేకేఆర్ వదులుకునే అవకాశం ఉంది.