హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్.. సంచలన ప్రదర్శనలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఏ మాత్రం ఊహించని ఫలితాలు.. అంచనాల్లేని ఆటగాళ్ల అనూహ్య ప్రదర్శనలు అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రతీ మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగుతూ.. అభిమానులను మునివేళ్లపై నిలబెడుతూ అసలు సిసలు మజాను అందిస్తున్నాయి.
కెరీర్ చరమాంకంలో ఉన్న ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి అదరగొడుతున్నారు. గత వారం రోజులుగా ఐపీఎల్ 2023 సీజన్ను సీనియర్ ఆటగాళ్లే తమ అద్భుమైన ఆటతీరుతో శాసిస్తున్నారు. తమలో ఇంకా సత్తా ఉందని చాటి చెబుతున్నారు. కుర్రాళ్ల కంటే మెరుగ్గా రాణిస్తున్నారు.

మొన్న అమిత్ మిశ్రా.. నిన్న సందీప్ శర్మ.. నేడు మోహిత్ శర్మ తమ అసాధారణ బౌలింగ్తో ఆశ్చర్యపరిచారు. లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న 40 ఏళ్ల అమిత్ మిశ్రా.. సన్రైజర్స్ హైదరాబాద్పై (2/23) రెండు వికెట్లు.. ఆర్సీబీతో(1/18) ఓ వికెట్ పడగొట్టాడు. చాలా కట్టడిగా బౌలింగ్ చేశాడు.
ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న పీయూష్ చావ్లా.. సీఎస్కేతో(1/33) ఒక వికెట్, ఢిల్లీ క్యాపిటల్స్(3/22)పై మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పీయూష్ చావ్లా అంతర్జాతీయ క్రికెట్కు దూరమై చాలా రోజులు అవుతోంది. అతను ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు.
రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సందీప్ శర్మ.. చెన్నై సూపర్ కింగ్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో ధోనీని కట్టడి చేసి చిరస్మరణీ విజయాన్నందించాడు. చివరి 3 బంతుల్లో 7 పరుగులను డిఫెండ్ చేసి ఆకట్టుకున్నాడు. అద్భుతమైన యార్కర్లతో ధోనీని కట్టడి చేశాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగిన మోహిత్ శర్మ.. అసాధారణ బౌలింగ్తో పంజాబ్ పతనాన్ని శాసించాడు.
తొలి మ్యాచ్లోనే రెండు కీలక వికెట్లు తీయడంతో పాటు నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత మోహిత్ శర్మ ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. 2020లో చివరిసారిగా ఐపీఎల్ ఆడిన అతన్ని గత రెండు సీజన్లలో ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఈసారి గుజరాత్ బేస్ ప్రైజ్కు కొనుగోలు చేసి అవకాశం కల్పించింది.
బ్యాటింగ్లో అజింక్యా రహానే, మహేంద్ర సింగ్ ధోనీ, అంబటి రాయుడు, శిఖర్ ధావన్.. కుర్రాళ్లకంటే మెరుగ్గా రాణిస్తున్నారు. దాంతో ఐపీఎల్ 2023లో అంకుల్సే అదరగొడుతున్నారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.