హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ఓటీటీ ప్రసారాలను ఉచితంగా అందిస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన జియో సినిమా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిస్నీ హాట్ స్టార్, సోనీ నెట్వర్క్లతో పోటీ పడి మరీ ఐపీఎల్ 2023 సీజన్ ఓటీటీ రైట్స్ను భారీ ధరకు దక్కించుకున్న జియో సినిమా తమ ప్రసారాలను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది.
అన్నట్లుగానే మ్యాచ్లను క్వాలిటీ కంటేట్తో ఎలాంటి రుసుము లేకుండా ప్రసారం చేస్తోంది. జియో సినిమా ఊహించినదాని కంటే ఎక్కువ స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చింది. ఒకే రోజు అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్గా చరిత్ర సృష్టించిన జియో సినిమా.. క్రీడా రంగంలోనే ఎన్నడూ లేనివిధంగా హయ్యెస్ట్ వ్యూయర్షిప్తో సరికొత్త రికార్డును లిఖించుకుంది.

ఓ మ్యాచ్ను గరిష్టంగా 2.5 కోట్ల మంది వీక్షించారు. ఈ అనూహ్య రెస్పాన్స్తో యాడ్స్ టారిఫ్లను డబుల్ చేసిన జియో సినిమా.. ఉచిత ప్రసారలకు కూడా మంగళం పాడే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాట ఇచ్చిన ప్రకారం ఈ సీజన్ మొత్తం ఫ్రీగా ప్రసారాలు అందించినా.. ఈ సీజన్ ముగిసిన వెంటనే సబ్స్క్రిప్షన్ టారిఫ్ ప్లాన్స్ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
డిస్నీ హాట్ స్టార్ తరహాలో ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు, నెల రోజుల టారిఫ్ ప్లాన్స్ సిద్దం చేయడంపై జియో సినిమా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వెంటనే ఈ టారిఫ్ ప్లాన్స్ను ప్రవేశపెడతామని జియో సినిమాకు చెందిన వయాకమ్ 18 మీడియా అండ్ కంటెంట్ బిజినెస్ హెడ్ జ్యోతి దేశ్పాండే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఈ సీజన్ పూర్తిగా ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు.
అయితే మిగతా ఓటీటీ సబ్స్క్రిప్షన్ చార్జీల కంటే జియో సినిమా సబ్స్క్రిప్షన్ ధరలు చాలా తక్కువగా ఉండేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వయాకమ్ 18 స్పోర్ట్స్.. ఐపీఎల్ ప్రసార హక్కులతో పాటు ఫిఫా వరల్డ్ కప్, ఎన్బీఏ, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్, ఏటీపీ మాస్టర్ 1000, అబుదాబి టీ10, డైమండ్ లీగ్, లా లిగా, సెరియా ఏ, లీగ్ 1, ఇండియన్ సూపర్ లీగ్, డబ్ల్యూపీఎల్ టోర్నీల హక్కులను దక్కించుకుంది.
స్పోర్ట్స్ ఈవెంట్సే కాకుండా సినిమాలను ప్రేక్షకులను అందిచే ప్రయత్నం చేస్తోంది. టాక్ షోలోతో పాటు కొన్ని సినిమాలను కూడా సొంత బ్యానర్లో తెరకెక్కించాలనుకుంటోంది.