అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేకు వాయిదా పడిన విషయం తెలిసిందే. వర్షంతో ముగింపు వేడుకలను రద్దు చేశారని అంతా అనుకున్నారు. కానీ రిజర్వ్ డే అయిన సోమవారం ఆట ప్రారంభమవ్వగా.. ఇన్నింగ్స్ బ్రేక్లో ముగింపు వేడుకలను నిర్వహించారు.
నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేజర్, లైటింగ్ షో అభిమానులను ఆకట్టుకుంది. ఈ లీగ్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ పేరు లైటింగ్ షోలో జిగేల్ మన్నది. జోనితా గాంధీ, డివైన్ తమ గాత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ ఫొటోలతో పాటు వారి ఐపీఎల్ రికార్డులను లైటింగ్ షోలో ప్రత్యేకంగా ప్రదర్శించారు.

ఈ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ బ్యాటర్లు దుమ్మురేపారు. విధ్వంసకర బ్యాటింగ్తో సాయి సుదర్శన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. వృద్దిమాన్ సాహా(39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది.
శుభ్మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 39), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. చెన్నై బౌలర్లలో పతీరణ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ తలో వికెట్ తీసారు.