అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం మళ్లీ అంతరాయం కలిగించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు రాని వర్షం.. చెన్నై బ్యాటింగ్ ప్రారంభించిన వెంటనే మొదలైంది. వర్షం భారీగా కురుస్తుండటంతో అంపైర్లు ఆటను నిలిపివేయగా.. సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పి వేసారు.
ఈ మ్యాచ్కు హాజరైన ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందరూ స్టేడియం పైకప్పుల కిందికి పరుగెత్తారు. వర్షం ఆగిపోతేనే మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అత్యుత్తమ డ్రైనేజీ సిస్టమ్ ఉండటంతో పాటు మైదానాన్ని సిద్దం చేసేందుకు అత్యుత్తమ టెక్నాలజీ నరేంద్రమోదీ స్టేడియంలో ఉంది. వర్షం ఆగిన కాసేపటికే మైదానాన్ని సిద్దం చేయగలరు.

వర్షం కారణంగానే ఆదివారం జరగాల్సిన ఈ మెగా ఫైనల్.. రిజర్వ్ డే అయిన నేటికి వాయిదా పడింది. ఉదయం నుంచి అహ్మదాబాద్లో ఎండ కొట్టగా.. ఫస్ట్ ఇన్నింగ్స్ సమయంలో కాస్త చిరు జల్లులు పడ్డాయి. కానీ ఆటకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. దాంతో ఐపీఎల్ ముగింపు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. చెన్నై బ్యాటింగ్కు దిగగానే వర్షం ధాటిగా మొదలైంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన సాయి సుదర్శన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. వృద్దిమాన్ సాహా(39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు.
శుభ్మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 39), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. చెన్నై బౌలర్లలో పతీరణ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ తలో వికెట్ తీసారు. ప్రస్తుతం వర్షం దంచికొడుతోంది. నిబంధనల ప్రకారం ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడితే డక్వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని తేల్చే అవకాశం ఉంది.
చెన్నై ఐదు ఓవర్లు ఆడితే వికెట్ నష్టపోకుండా 43పరుగులు చేయాలి. లేదంటే వికెట్ నష్టపోతే 49, రెండు వికెట్లు నష్టపోతే 56, మూడు వికెట్లు నష్టపోతే 65 పరుగులు చేస్తే డక్ వర్త్ లూయిస్ ప్రకారం చెన్నైకి విజయం దక్కుతోంది. లేదంటే గుజరాత్నే విజయం వరిస్తోంది. వర్షంతో మ్యాచ్ రద్దయినా టేబుల్ టాపర్ అయిన గుజరాత్ టైటాన్స్నే విజేతగా ప్రకటిస్తారు.