అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా రిజర్వ్డేకు షిఫ్ట్ అయ్యింది. ఎడతెరిపి లేకుండా పడిన వర్షంతో మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
దాంతో మెగా ఫైనల్ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రిజర్వ్ డే అయిన సోమవారం రాత్రి 7.30 గంటలకు ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చి ఓ మహిళా అభిమాని.. ఓ పోలీస్ అధికారిని చితకబాదింది. స్టేడియంలో డ్యూటీ చేస్తున్న సదరు పోలీస్ అధికారిని కాలితో తన్నడం కాకుండా పదే పదే నెట్టేసింది.

అసలు గొడవకు కారణం ఏంటో తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొందరేమో సదరు పోలీస్ అధికారి తాగిన మత్తులో సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, దాంతో ఆమె దేహ శుద్ది చేసిందని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం సదరు మహిళా రౌడీలా ప్రవర్తించిందని, అనవసరంగా పోలీస్ అధికారిపై చేయి చేసుకుందని మండిపడుతున్నారు.
సదరు మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మహిళా సాధికారిక అభివృద్ది అంటే ఇదేనా అని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ గొడవ జరుగుతున్నప్పుడు ఒక్కడు కూడా వారిని వారించలేదు.