అహ్మదాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన కీపింగ్ మాయాజాలన్ని ప్రదర్శించాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఫైనల్లో కళ్లు చెదిరే స్టంపింగ్తో ఔరా అనిపించాడు. మహేంద్రుడి మయాజాలానికి గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 39) నిరాశగా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా వేసిన ఏడో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
మ్యాచ్ ఆరంభంలోనే 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శుభ్మన్ గిల్ ఇచ్చిన సునాయస క్యాచ్ను దీపక్ చాహర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన గిల్, సాహాతో కలిసి చెన్నై బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. వరుస బౌండరీలతో జోరు కనబర్చాడు. దాంతో చెన్నై ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. దాంతో ఫీల్డింగ్లో చాలా తప్పిదాలు చేశారు.

రెండు సునాయస రనౌట్లను చేజార్చారు. ఓవైపు సాహా, శుభ్మన్ గిల్ ధాటిగా ఆడుతుండటంతో గుజరాత్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. ఈ పరిస్థితుల్లో జడేజాను రంగంలోకి దింపిన ధోనీ.. సూపర్ స్టంపింగ్తో గిల్ను ఔట్ చేసి తమ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు.
ఏడో ఓవర్ చివరి బంతిని జడేజా.. ఫ్లాట్ లెంగ్త్గా వేయగా.. గిల్ మూందుకు స్ట్రెచ్ అయ్యి డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ను మిస్సైన బంతి కీపర్ ధోనీ చేతిలో పడగా.. అతను వెంటనే వికెట్లను కొట్టేసాడు. అప్పటికే గిల్ క్రీజును ధాటడంతో స్టంపౌటయ్యాడు.
ధోనీ స్టంపౌట్పై అభిమానులు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ధోనీ చేసిన స్టంపౌట్లలో ఇప్పటి వరకు తాను చూసిన అత్యుత్తమైనది ఇదేనని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేయగా.. 4జీ, 5జీ కంటే ధోనీ వేగమే ఎక్కవని ఆకాశ్ చోప్రా కొనియాడాడు. ప్రస్తుతం ధోనీ స్టంపౌట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. స్టన్నింగ్ స్టంపౌట్ అని హర్షా భోగ్లే మెచ్చుకున్నాడు.
గిల్ 39 పరుగులకే వెనుదిరగడంతో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు పదిలంగా ఉంది. గిల్ 890 పరుగులతోనే ఈ సీజన్ను ముగించడంతో 2016 విరాట్ కోహ్లీ చేసిన 973 పరుగుల రికార్డు పదిలంగా ఉంది. ఐపీఎల్ 2018 ఫైనల్లో టాప్ స్కోరర్గా నిలిచిన కేన్ విలియమ్సన్(753)ను కూడా ధోనీ స్టంపౌట్ చేశాడు.