అహ్మదాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికే అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా చరిత్రకెక్కిన ధోనీ.. తాజాగా 250 మ్యాచ్ల మైలు రాయి అందుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్తో ధోనీ ఈ ఫీట్ సాధించాడు.
ఐపీఎల్లో 50 మ్యాచ్ల ఘనతను సీఎస్కే ఫ్రాంచైజీకే చెందిన సురేశ్ రైనా, బద్రీనాథ్ 2011లో తొలిసారి అందుకోగా.. 100 మ్యాచ్ల ఘనతను 2014లో సురేశ్ రైనా అందుకున్నాడు. 2017 సీజన్లో గుజరాత్ లయన్స్ తరఫున సురేశ్ రైనా 150 ఐపీఎల్ మ్యాచ్ల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత సురేశ్ రైనా క్యాష్ రిచ్ లీగ్కు దూరం కాగా.. ధోనీ రేసులోకి వచ్చాడు.

అందరికన్నా ముందు 200, 250 మ్యాచ్ మైలు రాయిని ధోనీ సాధించాడు. ఐపీఎల్ 2020 సీజన్లో 200, తాజా సీజన్లో 250 ఐపీఎల్ మ్యాచ్ల ఘనతను అందుకున్నాడు.
ఈ మెగా ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం వచ్చే సూచనలు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. 'వర్షం కారణంగా ఆదివారం పూర్తిగా డ్రెస్సింగ్ రూమ్కే పరిమితమయ్యాం. ఓ క్రికెటర్గా ఎప్పుడూ ఆడటానికి ప్రాధాన్యతిమిస్తాను. వర్షం కారణంగా మైదానానికి వచ్చిన ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడ్డారు.
వారికి కావాల్సిన మజాను ఈ రోజు మేం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. పిచ్పై చాలా గంటలు కవర్ కప్పి ఉంచారు. కానీ టోర్నీ ఆసాంతం ఇక్కడి పిచ్ బాగానే ఉంది. 20 ఓవర్ల గేమ్ ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీకి న్యాయం జరిగినట్లే. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నాం. 'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు. అయితే తన మనస్సు మాత్రం బ్యాటింగ్ చేయమని చెబుతుందని, దాంతోనే టాస్ ఓడినా పెద్దగా బాదలేదన్నాడు. వాతావరణ పరిస్థితులు తమ చేతుల్లో లేవని జట్టులో చర్చించామన్నాడు. ఏ జట్టు బాగా ఆడుతుందో ఆ టీమ్నే టైటిల్ వరిస్తుందని చెప్పాడు.
తమ ఆటగాళ్లను ప్రశాంతంగా ఉంచేందుకు వీలైనంత ప్రయత్నిస్తానని చెప్పిన హార్దిక్.. ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందన్నాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని తెలిపాడు.