అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్కు వరణుడు అడ్డంకిగా మారాడు. ప్రస్తుతం మైదానంలో భారీ వర్షం కురుస్తోంది.
దాంతో ఐపీఎల్ 2023 సీజన్ ముగింపు వేడుకలతో పాటు టాస్కు అంతరాయం కలిగింది. చిరు జల్లులతో మొదలైన వర్షం భారీగా కురుస్తోంది. మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పేసారు. వర్షంతో కురవడంతో ఇరు జట్లు చేజింగ్కే మొగ్గు చూపనున్నాయి. వర్షంతో ఈ రోజు ఆట కొనసాగకపోతే.. రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్ నిర్వహిస్తారు. ఒకవేళ సోమవారం కూడా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే ట్రోఫీని ఇరు జట్లు పంచుకోనున్నాయి.

అయితే ఇదే వేదికపై ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య గత శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫైయర్కు కూడా వర్షం అంతరాయం కలిగించింది. వర్షం ఆగిపోయిన తర్వాత పూర్తి మ్యాచ్ జరిగింది. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ రోజు ఎంత ఆట వీలైతే అంతే ఆట ఆడించి.. మిగిలిన ఆటను రిజర్వ్ డే రోజు కొనసాగించనున్నారు.
ఈ మ్యాచ్లో ఫలితం అంటూ తేలాలంటే రెండు జట్లు కనీసం ఐదేసి ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు డక్ వర్త్ లూయిస్ విధానాన్ని బట్టి విజేత ఎవరో నిర్ణయిస్తారు. ఇవన్నీ జరగకపోతే.. రాత్రి 1.20 సమయంలో సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఇలా కూడా విజేత ఎవరో తేలకపోతే ఇరు జట్లు ట్రోఫీని పంచుకోనున్నాయి.
మోదీ స్టేడియంలోని వర్షానికి సంబంధించిన కీలక అప్డేట్ను ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్విటర్ వేదికగా పంచుకున్నారు. 'ప్రస్తుతం భారీ వర్షం పడుతోంది. ఉరుములతో కూడిన వర్షం కారణంగా మైదానంలో నీళ్లు నిలిచాయి. మరికొద్ది క్షణాల్లో వర్షం ఆగిపోతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాత్రి 9.30 గంటల వరకు ఆట ప్రారంభమైతే ఒక్క ఓవర్ కూడా కుదించకుండా మ్యాచ్ నిర్వహించనున్నారు. రాత్రి 11.56 వర్షం ఆగితే ఐదు ఓవర్ల మ్యాచ్ జరుగుతోంది. అప్పటి వరకు కూడా వర్షం తగ్గకుంటే.. రిజర్వ్ డే ఉపయోగిస్తారు.'అని హర్షాభోగ్లే పేర్కొన్నాడు.