అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ ఎట్టకేలకు మొదలైంది. గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న ఈ మెగా ఫైనల్ను 15 ఓవర్లకు కుదించారు. చెన్నై లక్ష్యాన్ని కూడా తగ్గించారు. ఈ మ్యాచ్లో చెన్నై విజయం సాధించాలంటే 15 ఓవర్లలో 171 పరుగులు చేయాలి. నాలుగు ఓవర్ల పాటు పవర్ ప్లే ఉండనుండగా.. ప్రతీ బౌలర్ గరిష్టంగా మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయాలి.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన సాయి సుదర్శన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. వృద్దిమాన్ సాహా(39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు.

శుభ్మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 39), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. చెన్నై బౌలర్లలో పతీరణ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ తలో వికెట్ తీసారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్య చేధనకు దిగగా.. మూడు బంతులు వేయగానే వర్షం వచ్చింది.
వర్షం భారీగా కురవడంతో మైదానం చిత్తడిగా మారింది. మైదానంలో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ సాయంతో గ్రౌండ్ను మ్యాచ్కు సిద్దం చేశారు. ఈ మ్యాచ్లో చెన్నై విజయం సాధించాలంటే రిక్వైడ్ రన్ రేట్ కంటే ఎక్కువ స్కోర్తో బ్యాటింగ్ చేయాలి. మధ్యలో వర్షం వచ్చి మ్యాచ్ ఆగినా.. డక్ వర్త్ లూయిస్ ప్రకారం విజేతను నిర్ణయిస్తారు.