అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ గెలవాలని భావించిన చెన్నై సూపర్ కింగ్స్ ఆశలపై వరణుడు నీళ్లు జల్లాడు. గుజరాత్ టైటాన్స్తో జరగుతున్న ఫైనల్ మ్యాచ్కు అంతరాయం కలిగించాడు. కాసేపే వర్షం పడినా భారీగా పడటంతో మైదానం చిత్తడిగా మారింది. ప్రాక్టీస్ పిచ్తో పాటు ఔట్ ఫీల్డ్ బురదగా తయారైంది.
దాంతో వర్షం ఆగినా.. మ్యాచ్ను ప్రారంభించేందుకు అంపైర్లు టైమ్ తీసుకుంటున్నారు. రాత్రి 11.30 గంటలకు మైదానాన్ని మరోసారి పరిశీలించనున్నారు. రాత్రి 11.45 వరకు మ్యాచ్ ప్రారంభం కాకపోతే.. ఓవర్లను కుదించి ఆటను కొనసాగించనున్నారు.

డక్వర్త్ లూయిస్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ 19 ఓవర్లు ఆడితే 207, 18 ఓవర్లు ఆడితే 198, 17 ఓవర్లు అయితే 190, 16 ఓవర్లు అయితే 181 పరుగులుగా లక్ష్యాన్ని చేధించాల్సి ఉంటుంది. ఐదు ఓవర్లు ఆటనే సాధ్యమైతే మాత్రం చెన్నై 66 పరుగులు చేయాలి. 6 ఓవర్లు అయితే 78, ఏడు ఓవర్లు అయితే 90, 8 ఓవర్లు అయితే 101 పరుగులుగా లక్ష్యాన్ని అధిగమించాలి. మ్యాచ్ పూర్తిగా రద్దయితే మాత్రం గుజరాత్ టైటాన్స్ను విజేతగా ప్రకటించనున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన సాయి సుదర్శన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. వృద్దిమాన్ సాహా(39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు.
శుభ్మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 39), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. చెన్నై బౌలర్లలో పతీరణ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ తలో వికెట్ తీసారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్య చేధనకు దిగగా.. మూడు బంతులు వేయగానే వర్షం వచ్చింది.