హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ మాములుగా లేదు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన మూడేళ్లు అవుతున్నా.. కేవలం ఐపీఎల్ మాత్రంలోనే కొనసాగుతున్నా.. ధోనీపై ఉన్న అభిమానం ఇసుమంత కూడా తగ్గడం లేదు. ధోనీ కూడా 41 ఏళ్ల వయసులో అసాధారణ ఆటతీరుతో చెలరేగుతున్నాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో నిలకడగా రాణిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. దాంతో ధోనీ బ్యాటింగ్ చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ఈ తరం స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు దక్కని ఆదరణ ధోనీకి దక్కడం గమనార్హం. ధోనీ బ్యాటింగ్ చేసే సమయంలో టీవీ, ఓటీటీ వ్యూయర్షిప్ అమాంతం పెరిగిపోతుంది.

రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో ధోనీ 17 బంతులు ఆడి 3 సిక్సర్లతో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. 30 బంతుల్లో 63 పరుగులు కావాల్సిన పరిస్థితుల్లో బ్యాటింగ్ వచ్చిన ధోనీ.. అసాధారణ బ్యాటింగ్తో మ్యాచ్ను ఉత్కంఠగా మార్చాడు. ముఖ్యంగా సందీప్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాది గెలిపించినంత పని చేశాడు.
చివరి మూడు బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన సమయంలో సందీప్ శర్మ కట్టడిగా బౌలింగ్ చేయడంతో చెన్నై 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చెన్నై ఓడినా.. ధోనీ బ్యాటింగ్ లీగ్ అధికారిక బ్రాడ్ కాస్టర్స్ అయిన స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలకు పంట పండించింది. ధోనీ బ్యాటింగ్ను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు.
జియో సినిమాలో ఆల్టైమ్ వ్యూయర్ షిప్ రికార్డు నమోదవ్వగా.. స్టార్ స్పోర్ట్స్ వ్యూయర్షిప్ 47 శాతం పెరిగింది. జియో సినిమాలో 2.2 కోట్ల మంది చూశారు. ధోనీ బ్యాటింగ్ సమయంలో 60 లక్షల వ్యూస్ అమాంతం పెరిగాయి.
అంతేకాకుండా జియో సినిమా యాప్ను కూడా అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ధోనీ క్రేజ్ను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 'ధోనీ.. నీ క్రేజ్ మాములుగా లేదు సామి.. కోహ్లీ, రోహిత్ కూడా నీ ముందు పనికిరారని కామెంట్ చేస్తున్నారు. భారీ ధరకు ఐపీఎల్ రైట్స్ను కొనుగోలు చేసిన స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలు.. అదే రీతిలో లాభాలు ఆర్జిస్తున్నాయి. వ్యూస్ పెరగడంతో యాడ్స్ రేట్లను అమాంతం పెంచేసాయి.