బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్పై సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2023 సీజన్లో కార్తీక్ దారుణంగా విఫలమవుతుండటంతో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ల్లో ఆర్సీబీ ఓటమిపాలవుతోంది. టీమ్ బ్యాటింగ్ మొత్తం కేజీఎఫ్(కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్)పైనే ఆధారపడి ఉండటంతో ఆర్సీబీ విజయవకాశాలు దెబ్బతింటున్నాయి.
గతేడాది సూపర్ బ్యాటింగ్తో ఫినిషర్గా సత్తా చాటిన కార్తీక్ ఈ సీజన్లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్లు ఆడిన కార్తీక్ కేవలం 83 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు డకౌట్లు ఉండటం గమనార్హం. కోల్కతా నైట్రైడర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లోనూ దినేశ్ కార్తీక్ 22 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్లో విఫలమవ్వడమే కాకుండా యువ ప్లేయర్ సుయాశ్ ప్రభుదేశాయ్ను రనౌట్ చేశాడు.

దాంతో దినేశ్ కార్తీక్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీకి శనిలా దాపురించాడని, వెంటనే అతన్ని పక్కనపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా కామెంట్ను దినేశ్ కార్తీక్ నిజం చేశాడని మండిపడతున్నారు. దినేశ్ కార్తీక్ పార్ట్ టైమ్ క్రికెటరని, ఫుల్ టైమ్ కామెంటేటరని విక్రాంత్ గుప్తా గతంలోనే విమర్శించాడు.
గత సీజన్లో సూపర్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్న దినేశ్ కార్తీక్.. ఈ సీజన్లో ఆర్సీబీని ఫినిష్ చేసే బాధ్యత తీసుకున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. కార్తీక్ వల్ల ఆర్సీబీకి పైసా ఉపయోగం లేదని, అతన్ని వెంటనే తుది జట్టు నుంచి తప్పించి యువ ప్లేయర్ అనూజ్ రావత్కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
కేకేఆర్తో మ్యాచ్లో 21 పరుగుల తేడాతో ఓడిన ఆర్సీబీ ఈ సీజన్లో నాలుగో ఓటమిని నమోదు చేసింది. ఇందులో రెండు మ్యాచ్లు కేకేఆర్ చేతిలోనే ఓడటం గమనార్హం.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. చివర్లో రింకూ సింగ్(18 నాటౌట్), డేవిడ్ వైస్(12 నాటౌట్) మెరుపులు మెరిపించారు. జాసన్ రాయ్(29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), నితీశ్ రాణా(21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 48) రాణించగా..రింకూ సింగ్(18 నాటౌట్), డేవిడ్ వైస్(12 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆర్సీబీ బౌలర్లలో హసరంగా, విజయ్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ (37 బంతుల్లో 6 ఫోర్లతో 54), మహిపాల్ లోమ్రోర్(18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 34) రాణించినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో సుయాశ్ శర్మ, ఆండ్రీ రస్సెల్ రెండేసి వికెట్లు తీయగా.. వరుణ చక్రవర్తీ మూడు వికెట్లు పడగొట్టాడు.