హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణంగా విఫలమైంది. అనూహ్య ఆటతీరుతో పరాజయాల పరంపర కొనసాగించిన ఢిల్లీ.. చివరకు పాయింట్స్ టేబుల్లో తొమ్మిదో స్థానంలో నిలిచి ఇజ్జత్ కాపాడుకుంది. జట్టు నిండా స్టార్లు ఉన్నా.. విజయాలు అందుకోలేకపోయింది. సీజన్ ప్రారంభానికి ముందే ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురవ్వడం కోలుకోలేని దెబ్బతీసింది.
డేవిడ్ వార్నర్కు సారథ్య బాధ్యతలు అప్పగించినా.. టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. పంత్ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమ్ మేనేజ్మెంట్ చేసిన ప్రయోగాలన్నీ బెడిసికొట్టాయి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న యువ ఓపెనర్ పృథ్వీ షా ఘోర వైఫల్యం ఢిల్లీ పతనాన్ని శాసించింది. లీగ్ ఫస్టాఫ్లో 7 మ్యాచ్లకు ఒక్కటి మాత్రమే గెలిచిన ఢిల్లీ.. సెకండాఫ్లో మరో నాలుగు విజయాలు అందుకొని గౌరవంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ ఘోర వైఫల్యాన్ని ఢిల్లీ మేనేజ్మెంట్ సీరియస్గా తీసుకుంది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్పై ఆగ్రహంగా ఉన్న మేనేజ్మెంట్ అతనితో పాటు టీమ్ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్కు సంబంధించి మినీ వేలం జరగనుంది.
ఈ మినీ వేలానికి ఢిల్లీ పకడ్బందీ ప్రణాళికలు రచిస్తోంది. పేలవ ప్రదర్శన జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లతో కూడిన ఓ జాబితాను ఇప్పటికే సిద్దం చేసింది. ఈ లిస్ట్లోని ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తోంది. ఈ జాబితాలో ఓ ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. పృథ్వీ షాతో పాటు మనీశ్ పాండే, ఇషాంత్ శర్మలపై వేటు వేసేందుకు ఢిల్లీ సిద్దమైనట్లు తెలుస్తోంది.

1. పృథ్వీ షా
ఐపీఎల్ 2023 సీజన్లో పృథ్వీ షా వైఫల్యం ఢిల్లీ కొంపముంచింది. పేలవ ఆటతీరుతో జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా మొత్తం 8 మ్యాచ్లే ఆడి ఓ హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులే చేశాడు. ఆ హాఫ్ సెంచరీ కూడా చివరగా ఢిల్లీ 13వ మ్యాచ్లో చేశాడు. పృథ్వీ షా వైఫల్యం.. టీమ్ బ్యాటింగ్పై తీవ్ర ప్రభావం చూపింది.
డేవిడ్ వార్నర్తో పాటు మిచెల్ మార్ష్, మనీశ్ పాండేలపై ఒత్తిడి నెలకొల్పింది. పృథ్వీ షా పేలవ ఆటతీరు కారణంగా మిచెల్ మార్ష్ సైతం ఆరంభ మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు.

2. మనీశ్ పాండే..
ఐపీఎల్ చరిత్రలోనే తొలి సెంచరీ సాధించిన భారత క్రికెటర్గా గుర్తింపు పొందిన మనీశ్ పాండే గత ఐదేళ్లుగా దారుణంగా విఫలమవుతున్నాడు. ప్రతీ ఏడాది ఓ ఫ్రాంచైజీకి ఆడుతున్న ఈ కర్ణాటక బ్యాటర్ చెత్త ఆటతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సారి ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన మనీశ్ పాండే.. 10 మ్యాచ్ల్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 160 పరుగులే చేశాడు.

3. ఇషాంత్ శర్మ..
ఐపీఎల్ 2023 సీజన్లో ఢిల్లీ తరఫున ఇషాంత్ శర్మ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. 35 ఏళ్ల వయసులో అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 8 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసాడు. అయితే అతని వయసు, ఫిట్నెస్ దృష్ట్యా ఇషాంత్ శర్మను పక్కనపెట్టే యోచనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. క్రికెట్కు అతను గుడ్బై చెబితే సపోర్ట్ స్టాఫ్లోకి తీసుకునే ఛాన్స్ ఉంది.