అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు వరణుడు ఊహించని షాకిచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరగాల్సిన మెగా ఫైనల్ వర్షం కారణంగా వాయిదా పడింది. ఐదు గంటల పాటు ఎడ తెరిపిలేకుండా కురిసిన వర్షంతో మైదానం తడిసి ముద్దైంది.
పిచ్ రిపోర్ట్ సమయంలో ప్రారంభమైన వర్షం ఇంకా పడుతూనే ఉంది. మధ్య మధ్యలో దాగుడు మూతలు ఆడిన వర్షం ఆటకు ఏ మాత్రం సహకరించలేదు. పలు మార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో రిజర్వ్ డే అయిన సోమవారానికి మ్యాచ్ను వాయిదా వేసారు.

మే 29(సోమవారం) రాత్రి 7 గంటలకు టాస్ వేయనుండగా.. 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫిజికల్ టికెట్స్ను జాగ్రత్తగా ఉంచుకొని రేపు మ్యాచ్కు రావాలని స్టేడియం నిర్వాహకులు ప్రేక్షకులకు సూచించారు. ఇవే టికెట్లు రేపు చెల్లుతాయని చెప్పారు. అయితే ముగింపు వేడుకలు మాత్రం వర్షం కారణంగా రద్దయ్యాయి. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్ రిజర్వ్డేకు వాయిదా పడటం ఇదే తొలిసారి.
వర్షాల బాధలు తప్పించుకునేందుకు బీసీసీఐ.. ఈ లీగ్ను వేసవికాలంలో నిర్వహిస్తోంది. కానీ ఈసారి వర్షాలు కాలంతో సంబంధం లేకుండా వచ్చి మ్యాచ్లకు అంతరాయం కలిగించాయి. అయితే రిజర్వ్ డే అయిన సోమవారం కూడా వర్షం వచ్చే సూచనలున్నాయి. భారీ వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వెదర్ కాస్ట్ పేర్కొంది.
ఒక వేళ రేపు కూడా మ్యాచ్ సాధ్యం కాక రద్దయితే ట్రోఫీని రెండు జట్లు షేర్ చేసుకోనున్నాయి. రిజర్వ్ డే కూడా కనీసం ఐదు ఓవర్ల ఆటను ఆడించే ప్రయత్నం చేస్తారు. ఇక మ్యాచ్ రద్దవ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. బిగ్ ఫైనల్ మ్యాచ్తో సండేను ఫన్డే మార్చాలనుకున్న వారికి నిరాశే ఎదురైంది. అధికారిక బ్రాడ్కాస్టర్తో పాటు బార్లు, రెస్టారెంట్లకు కూడా తీరని నష్టం జరిగింది.