చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు మరో ఓటమి ఎదురైంది. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 6 వికెట్ల తేడాతో సీఎస్కేను చిత్తు చేసింది. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు ఆడలేకపోయిన ధోనీ సేన ఓటమికి తలవంచింది. అయితే ఈ ఓటమి చెన్నై సూపర్ కింగ్స్ను డేంజర్ జోన్లో నిలబెట్టింది.
ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ మే20న జరిగే చివరి మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. 13 మ్యాచ్ల్లో 7 విజయాలతో పాటు ఓ మ్యాచ్ రద్దవ్వడంతో 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు దగ్గరగా ఉన్న సీఎస్కే.. మరో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా టోర్నీలో ముందడుగు వేస్తోంది.

ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఢిల్లీ చేతిలో చెన్నై ఓడి ప్లే ఆఫ్స్ చేరాలంటే.. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ తదుపరి మ్యాచ్ల్లో కనీసం ఒక మ్యాచ్ ఓడిపోవాలి. లేదంటే చెన్నై టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.
శనివారం ఆర్సీబీ చేతిలో రాజస్థాన్, కేకేఆర్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిన తర్వాత ప్లే ఆఫ్స్ చేరే జట్ల అవకాశాల శాతం స్వల్పంగా మారింది. గుజరాత్ టైటాన్స్ 98 శాతం అవకాశాలుండగా... చెన్నైకి 90 శాతం, ముంబై ఇండియన్స్కు 80 శాతం, లక్నో సూపర్ జెయింట్స్కు 61 శాతం అవకాశాలున్నాయి. ఆర్సీబీ అవకాశాలు 31 శాతానికి పెరగ్గా.. పంజాబ్కు 21 శాతం చాన్సెస్ ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ అవకాశాలు 11 శాతంకు పడిపోగా.. కేకేఆర్ 6 శాతం, సన్రైజర్స్ 2 శాతానికి పడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా తప్పుకుంది.
ఐపీఎల్ 2023 సీజన్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ (మే 23), ఎలిమినేటర్ మ్యాచ్ (మే 24) చెన్నై వేదికగా జరుగనున్నాయి. చెన్నై టాప్ - 2లో ఉంటే తొలి క్వాఫయిర్ను చెన్నైలో ఆడే అవకాశం ఉంటుంది. మూడు లేదా నాలుగో స్థానంలో ఉంటే కూడా చెన్నైలోనే ఎలిమినేటర్ మ్యాచ్ను ఆడాల్సి ఉంది. రెండో క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్లు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు.