చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ధోనీ ఇంకొన్నాళ్లు ఆడుతాడని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ చివరి మ్యాచ్ ఆడేసింది. ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ధోనీ సేన 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం చివర్లో ఆటగాళ్లంతా మైదానమంతా కలియతిరిగి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఫ్రాంచైజీ జెర్సీలతో పాటు టెన్నిస్ బాల్స్, రాకెట్స్ను బహుమతులుగా వారివైపు విసిరేసారు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ధోనీ ఆటోగ్రాఫ్ను తీసుకున్నాడు. దాంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? అనే సందేహం కలిగింది.

ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడే చివరి మ్యాచ్తో ఆటకు అల్విదా ప్రకటించనున్నాడా? చర్చకు తెరలేసింది. చెపాక్ మైదానంలో రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్లు ఉన్నప్పటికీ.. లీగ్దశలో మాత్రం సీఎస్కేకు కేకేఆర్తోనే చివరి మ్యాచ్. దీంతో ఆటగాళ్లు కూడా చెన్నై అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియోను సీఎస్కే తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుది.
అయితే, చివర్లో చెన్నై ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక విషయం తెలియజేశాడు. ''వచ్చే సీజన్లోనూ మహేంద్ర సింగ్ ధోనీ తప్పకుండా ఆడతాడనే నమ్మకం మాకుంది. అభిమానులు ఎల్లవేళలా ఇలానే మద్దతుగా నిలవాలని కోరుతున్నా'' అని సీఈవో వెల్లడించాడు. అయితే ధోనీ ఆడుతాడని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయాడు. ధోనీకి రిటైర్మెంట్ ప్రకటించాలని ఉన్నా.. చెన్నై ఫ్రాంచైజీ అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం 15 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. చివరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో సీఎస్కే తలపడనుంది. ఆ మ్యాచ్లో గెలిస్తే.. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్లో ఓడితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. అప్పుడు, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మ్యాచ్ ఫలితాలపై చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
ఐపీఎల్ 2023 సీజన్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ (మే 23), ఎలిమినేటర్ మ్యాచ్ (మే 24) చెన్నై వేదికగా జరుగనున్నాయి. చెన్నై టాప్ - 2లో ఉంటే తొలి క్వాఫయిర్ను చెన్నైలో ఆడే అవకాశం ఉంటుంది. మూడు లేదా నాలుగో స్థానంలో ఉంటే కూడా చెన్నైలోనే ఎలిమినేటర్ మ్యాచ్ను ఆడాల్సి ఉంది. రెండో క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్లు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు.