హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపరం కొనసాగుతోంది. టోర్నీలో ఆరెంజ్ ఆర్మీ 6వ ఓటమిని నమోదు చేసింది. కోల్కతా నైట్రైడర్స్తో ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో పేలవ బ్యాటింగ్తో 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్లో 9 పరుగులు చేయలేక ఓటమికి తల వంచింది.
హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్పై విజయాన్నందుకున్న సన్రైజర్స్..అదే జోరును కొనసాగించలేకపోయింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ 6 పరాజయాలతో పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో నిలిచింది.

కేకేఆర్ చేతిలో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్లకు ఐదు గెలవాల్సిందే. ఒక్కటి ఓడినా ప్లే ఆఫ్స్ అవకాశాలు మూసుకుపోతాయి. నాలుగు విజయాలే నమోదు చేస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. రన్రేట్ కూడా కీలకం అవుతోంది. ప్రస్తుతం సన్రైజర్స్ రన్రేట్(-0.540) నెగటీవ్గా ఉంది.
ప్రస్తుతం సన్రైజర్స్ ఆట తీరు చూస్తుంటే ప్లే ఆఫ్స్ చేరడం దేవుడెరుగు చివరి ఐదు మ్యాచ్ల్లో రెండు విజయాలు నమోదు చేసినా గొప్పే అనిపిస్తోంది. పేలవ బ్యాటింగ్ ఆ జట్ట కొంపముంచుతోంది. స్టార్ ఆటగాళ్లంతా విఫలమవుతున్నారు. ఒకరు ఆడితే మరొకరు విఫలమవుతున్నారు. నిలకడగా రాణించలేకపోతున్నారు.
రూ.13.25 కోట్లు పెట్టిన హ్యారీ బ్రూక్, రూ.8 కోట్లు పెట్టి తీసుకున్న మయాంక్ అగర్వాల్.. తమ చెత్త ఆటతో టీమ్ను ముంచేసారు. ఒకటి, రెండు ప్రదర్శనలు మినహా ఈ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. రాహుల్ త్రిపాఠి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఎయిడెన్ మార్క్రమ్ కూడా దారుణంగా విఫలమవుతున్నాడు.
హెన్రీచ్ క్లాసెన్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. కానీ చివరి వరకు నిలిచి విజయ లాంఛనాన్ని పూర్తి చేయలేకపోతున్నాడు. బౌలింగ్ విభాగం రాణిస్తున్నా.. బ్యాటర్లు చేతులెత్తేయడం సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమిని శాసిస్తోంది. జట్టులో ఎన్ని మార్పులు చేసినా.. బ్యాటింగ్ ఆర్డర్ మార్చినా ఆశించిన ఫలితాన్ని సన్రైజర్స్ అందుకోలేకపోతుంది.