
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, ఇంగ్లండ్ ప్లేయర్ విల్ జాక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన విల్ జాక్స్.. గాయంతో జట్టు నుంచి అర్థంతరంగా తప్పుకున్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ విల్ జాక్స్ గాయపడ్డాడు. అతని ఎడమ కాలికి గాయమైనట్లు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తెలిపింది.
గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, పూర్తిగా కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారని ఈసీబీ స్పష్టం చేసింది. ఈ కారణంగానే బంగ్లాదేశ్ పర్యటన నుంచి విల్ జాక్స్ తప్పుకున్నాడని, టీ20 సిరీస్కు కూడా దూరమయ్యాడని పేర్కొంది. లండన్లో రిహాబిలిటేషన్ తీసుకుంటాడని తెలిపింది. ఈసీబీ ప్రకారం విల్ జాక్స్ నాలుగు వారాలు ఆటకు దూరమైతే మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభ మ్యాచ్లకు అతను దూరమయ్యే అవకాశాలున్నాయి.
కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలంలో విల్స్ జాక్స్ను ఆర్సీబీ రూ.3.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇటీవల సౌతాఫ్రికా టీ20 లీగ్లో విల్ జాక్స్ సత్తా చాటాడు. ప్రిటోరియా క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన అతను అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లోనూ రాణించాడు. దాంతో ఆర్సీబీ తరఫున కూడా చెలరేగుతాడని ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ భావించారు. కానీ దురదృష్టవశాత్తు అతను ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. విల్ జాక్స్ గైర్హాజరీ.. ఆర్సీబీ టీమ్ కాంబినేషన్ను దెబ్బతీయనుంది. ఇప్పటికే ఆ జట్టు స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ జోష్ హజెల్ వుడ్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో విల్ జాక్స్ గాయపడటం ఆ జట్టును కలవరపెడుతోంది.