
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందే కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరహాలోనే తమ కెప్టెన్ సేవలను ఆ జట్టు కోల్పోనుంది. వెన్ను గాయం తిరగబెట్టడంతో ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్లో బ్యాటింగ్కు రాని శ్రేయస్ అయ్యర్.. చాలా కాలం పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయ్యర్ నడవలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో ఫీల్డింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్.. నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్కు రాలేదు.
ఈ మ్యాచ్ జరుగుతుండగానే అయ్యర్ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ సిరీస్కు ముందు వెన్నుగాయంతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్.. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో చికిత్స తీసుకొని రీఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడని అయ్యర్.. ఢిల్లీ టెస్ట్తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్లో విఫలమైన అయ్యర్.. ఇండోర్ టెస్ట్లో పర్వాలేదనిపించాడు. ఇక అహ్మదాబాద్ టెస్ట్లో గాయం తిరగబెట్టడంతో బ్యాటింగ్కు రాలేదు. అయ్యర్ గాయం తీవ్రత నేపథ్యంలో ఆసీస్తో వన్డే సిరీస్ నుంచి అతన్ని బీసీసీఐ తప్పించింది.
అయ్యర్ గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 'దురదృష్టవశాత్తు అయ్యర్ గాయం తిరగబెట్టింది. బ్యాటింగ్ కోసం రోజంతా ఎదురు చూశాడు. కానీ ఆ రోజు ముగిసిన అనంతరం అతని గాయం తిరగబెట్టింది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్ష చేశారు. స్కాన్స్ వచ్చిన కచ్చితమైన రిపోర్ట్ ఏంటో నాకు తెలియదు. రికవరీ కావడానికి ఎంత సమయం పడుతుందనే సమాచారం కూడా మా వద్ద లేదు. కాకపోతే అతను నడవలేని స్థితిలో ఉన్నాడు.'అని రోహిత్ తెలిపాడు. మరోవైపు అయ్యర్.. బలంగా తిరిగి వస్తానని ట్వీట్ చేశాడు.

మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023 కూడా అయ్యర్ దూరమయ్యే అవకాశాలున్నాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది.ప్రస్తుతం బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అయ్యర్కు శస్త్రచికిత్స అవసరమని సూచించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే అతను.. మూడు నుంచి నాలుగు నెలల పాటు ఆటకు దూరమవుతాడు. అదే జరిగితే కోల్కతా నైట్రైడర్స్కు కోలుకోలేని దెబ్బ పడినట్లే.
ఐపీఎల్ 2022 మేగా వేలంలో శ్రేయస్ అయ్యర్ను కేకేఆర్ రూ. 12.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అతన్ని సారథిగా కూడా నియమించింది. గాయం కారణంగా అతని సేవలను కోల్పోవడం కేకేఆర్కు తీవ్ర నష్టం చేయనుంది. అయ్యర్ గైర్హాజరీలో షకీబ్ అల్ హసన్.. కేకేఆర్ను నడిపించే అవకాశాలున్నాయి. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్లు గాయాలతో భారత జట్టుతో పాటు ఐపీఎల్ దూరమైన విషయం తెలిసిందే.