
మే 28న ఐపీఎల్ 2023 ఫైనల్..
బోర్డు వర్గాల సమాచారం ప్రకారం మార్చి 31 లేదా ఏప్రిల్ 1 ఐపీఎల్ 2023ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ శనివారం కావడంతో ఆ రోజే లీగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలవడంతో.. అహ్మదాబాద్లోనే మొతేరా స్టేడియంలోనే తొలి మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్ ఆరంభం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నప్పటికీ.. ముగింపు తేదీ బీసీసీఐకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మే 28 లేదా జూన్ 4వ తేదీన ఐపీఎల్ ఫైనల్ జరపాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ను జూన్ తొలి వారంలో నిర్వహించే అవకాశం ఉంది.

భారత్ ఫైనల్ చేరితే..
ఒకవేళ భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్కు అర్హత సాధిస్తే.. బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్ను సవరించాల్సి వస్తుంది. లండన్లోని ది ఓవల్ స్టేడియంలో జూన్ 7-11 తేదీల మధ్య టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరిగే అవకాశం ఉంది. డబ్ల్యూటీసీ 2023 ర్యాంకింగ్స్లో టీమిండియా ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.
ఈ నెలలోనే బంగ్లాదేశ్తో రెండు టెస్టులు ఆడనున్న భారత్.. వచ్చే ఏడాది సొంత గడ్డ మీద ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ ఓటమిపాలవ్వడంతో టీమిండియా ఫైనల్ చేరే అవకాశాలు మెరుగయ్యాయి. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంతోపాటు.. ఆసీస్పై టెస్టు సిరీస్లో భారత్ 4-0 లేదా 3-0 తేడాతో గెలిస్తే రోహిత్ సేనకు ఫైనల్ బెర్త్ దక్కుతుంది.

ఐపీఎల్ ఫైనల్తో క్లాష్..
అదే జరిగితే.. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ తేదీ మార్చాల్సి ఉంటుంది. మే 28 లేదా జూన్ 4 తేదీ కంటే ముందే ఐపీఎల్ ఫైనల్ నిర్వహించాల్సి ఉంటుంది. వరల్ట్ టెస్ట్ చాంపియన్ షిప్ గెలవాలంటే రెండు వారాల ముందే టీమిండియా ఇంగ్లండ్కు చేరాల్సి ఉంటుంది. అక్కడ రెండు, మూడు వామప్ మ్యాచ్లు ఆడితే గానీ భారత్కు అక్కడి పరిస్థితులు అలవాటవ్వవు. డబ్ల్యూటీసీ ఫైనల్తో క్లాష్ కాకుండా ఐపీఎల్ షెడ్యూల్ రూపొందిస్తామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు
'వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్తో ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ కాకుండా చూసుకుంటాం. ప్లేయర్ల అందుబాటులో ఉండే విషయంలో ఇది సమస్యగా మారుతుందనే విషయం మాకు తెలుసు. ఐపీఎల్ షెడ్యూల్ గురించి సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నాం. ఇప్పటి వరకు అయితే ప్రారంభ, ముగింపు తేదీలను ఫైనలైజ్ చేయలేదు. ఐపీఎల్ 2023 మార్చిలో ప్రారంభమయ్యే మే చివరి వారంలో పూర్తయ్యే అవకాశం ఉంది.'అని సదరు అధికారి పేర్కొన్నాడు.

మ్యాచ్ల సంఖ్య తగ్గించే చాన్స్..
నిబంధనల ప్రకారం ఐసీసీ టోర్నీ ముందు ఏడు రోజుల వరకు ఎలాంటి క్రికెట్ టోర్నీ నిర్వహించడానికి వీలు లేదు. మార్చి-మే విండోను ఐపీఎల్కు ఉపయోగించుకోవాలనుకుంటున్న బీసీసీఐ.. 74 మ్యాచ్ల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది. ఇక భారత్తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక కూడా ఫైనల్ రేసులో ఉన్నాయి. ఒకవేళ భారత్ ఫైనల్ చేరకున్నా.. రేసులో ఉన్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ చివరి మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
