హైదరాబాద్: రెండేళ్ల క్రితం వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ శాసించాయి. అత్యధిక టైటిళ్లు గెలవడంతో పాటు ప్రతీ సీజన్లో తమ ఆటతో అభిమానులను ఆకట్టుకున్నాయి. కానీ ఏ మాత్రం అంచనాలు లేకుండా గతేడాది లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. ఈ రెండు జట్లను తలదన్నే ప్రదర్శనతో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్ ఎగరేసుకుపోయింది. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు ఎక్కడా తడబడకుండా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది.
వాస్తవానికి గత సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ టీమ్ను విమర్శించినవారే తప్పా ప్రశంసించినవారు ఒక్కరు లేరు. ఏ మాత్రం ఫామ్లో లేని హార్దిక్ పాండ్యా కెప్టెనా? ఏ మాత్రం అనుభవం లేని ఆశిష్ నెహ్రా కోచ్ ఏంటి? అని ఎగతాళి చేసినవారే. కానీ ఈ ఇద్దరూ టైటిల్ గెలిచి అందరి నోళ్లు మూయించారు. అదే జోరును ఈ సీజన్లోనూ కొనసాగించి తమ విజయం గాలివాటం కాదని నిరూపించారు.

గతేడాదిలానే ఐపీఎల్ 2023 సీజన్లోనూ గుజరాత్ టైటాన్స్ అందరికన్నా ముందే ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయ్యింది. 13 మ్యాచ్ల్లో 9 విజయాలతో 18 పాయింట్లతో క్వాలిఫయర్కు కూడా అర్హత సాధించింది. ఆర్సీబీతో జరిగే చివరి లీగ్ మ్యాచ్ ఆ జట్టుకు ఇక ప్రాక్టీస్ మ్యాచే. ఈ మ్యాచ్లో ఓడినా గుజరాత్ టైటాన్స్కు వచ్చే నష్టమేం లేదు. సమష్టి ప్రదర్శన గుజరాత్ టైటాన్స్ విజయ రహస్యం. ఆ జట్టులో ప్రతీ మ్యాచ్కు ఒకరు మ్యాచ్ విన్నర్గా నిలిచారు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. పోరాడితే పోయేదేమి లేదు అన్నట్లు ఆడటమే ఆ జట్టును ఈ స్థాయిలో నిలబెట్టింది. అయితే టీమ్ సమష్టి ప్రదర్శనకు, విజయాలకు ఏకైక కారణం హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా. ఈ విజయాల క్రెడిట్ పూర్తిగా అతనిదే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టీమ్ కాంబినేషన్ నుంచి మ్యాచ్లో ప్రతీ ప్రణాళిక వెనుక నెహ్రా ఉన్నాడు.

మ్యాచ్ జరుగుతున్నంత సేపు నెహ్రా అందరి కోచ్ల్లా డగౌట్లో కూర్చోకుండా బౌండరీ లైన్ వద్ద నిల్చొని ఆటగాళ్లకు సలహాలు ఇస్తూనే ఉంటాడు. వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీ ఆటగాళ్లు నెహ్రా ఎక్స్ట్రాలు చేస్తున్నాడని విమర్శించినా.. ఫుట్బాల్ కోచ్ అనుకుంటున్నాడని ఎగతాళి చేసినా అతను ఏ మాత్రం పట్టించుకోలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కంటే ఎక్కువగా గేమ్ గురించి ఆలోచిస్తూ అప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తూ గుజరాత్ విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
టీమ్ ఎంపికపై కూడా నెహ్రా చాలా ఫోకస్ పెట్టాడు. ఇతర ఫ్రాంచైజీలు చీకొట్టిన మోహిత్ శర్మను కొనుగోలు చేసి.. స్టార్ పెర్ఫార్మర్గా మార్చాడు. విజయ్ శంకర్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా వంటి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపి వారు చెలరేగేలా చేశాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్స్లు ఇచ్చానని అవమానంతో కుంగిపోయిన యశ్ దయాల్కు అండగా నిలిచి మళ్లీ తుది జట్టులోకి తీసుకున్నాడు.
నెహ్రా తన సూపర్ కోచింగ్తో గుజరాత్ టైటాన్స్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. మరోసారి డిఫెండింగ్ ఛాంపియన్గా టైటిల్ నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే నెహ్రాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అతన్ని టీమిండియా హెడ్ కోచ్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.