అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ను డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేజేతులా చేజార్చుకుంది. చెన్నై సూపర్ కింగ్స్తో సోమవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ ఆసాంతం పూర్తి ఆధిపత్యం చెలాయించిన గుజరాత్ టైటాన్స్.. చివరి రెండు బంతుల్లో తడబడి రన్నరప్గా నిలిచింది.
అయితే గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అత్యుత్సాహమే ఆ జట్టు కొంపముంచింది. తనదైన కోచింగ్తో జట్టుకు విజయాలు అందించి.. అరంగేట్ర సీజన్లోనే ఛాంపియన్గా నిలబెట్టిన నెహ్రా.. ఐపీఎల్ 2023 సీజన్లోనూ అదే జోరును కొనసాగించాడు. ఫుట్బాల్ కోచ్ మాదిరి బౌండరీ లైన్ వద్ద నిలబడి పదే పదే ఆటగాళ్లతో మాట్లాడుతూ కీలక సలహాలు ఇస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

తన కోచింగ్ను వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీ క్రికెటర్లు విమర్శించినా.. నెహ్రా పట్టించుకోలేదు. విభిన్నమైన తన కోచింగ్తో గుజరాత్ టైటాన్స్ను టేబుల్ టాపర్గా నిలబెట్టడమే కాకుండా.. క్వాలిఫయర్-1లో ఓడినా రెండో క్వాలిఫయర్లో గెలిపించి ఫైనల్ చేర్చాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఫైనల్లోనూ నెహ్రా తన మార్క్ కోచింగ్ను చూపెట్టాడు.
ఈ సీజన్లోనే డేంజరస్ బ్యాటర్గా మారిన శుభ్మన్ గిల్ ఔటైనా.. సాయి సుదర్శన్తో చెన్నై బౌలింగ్ వ్యూహాలకు చెక్ పెట్టాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్తో గుజరాత్ భారీ లక్ష్యం అందుకున్నా.. వర్షం వారి ప్రణాళికలను తల కిందులు చేసింది. అయినా అప్పటికప్పుడు వ్యూహాలు రచించి ధాటిగా ఆడుతున్న చెన్నై ఓపెనర్లకు నూర్ అహ్మద్తో చెక్ పెట్టించాడు. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన రహానే, రాయుడులను పెవిలియన్ చేర్చాడు.
బిగ్ ఫినిషర్గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనీని గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. మోహిత్ శర్మ సాయంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయించి దాదాపు విజయాన్ని ఖాయం చేశాడు. ఇక నెహ్రా సూచనలు తూచ తప్పకుండా పాటించిన మోహిత్ శర్మ ఆఖరి ఓవర్లో మూడు స్టన్నింగ్ యార్కర్లతో పాటు ఓ లో ఫుల్ టాస్తో చెన్నైని ఒత్తిడిలో పెట్టాడు. చివరి రెండు బంతుల్లో చెన్నై విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. స్ట్రైకింగ్లో జడేజా ఉన్నాడు.
అప్పటి వరకు బిగ్ షాట్స్ ఆడేందుకు జడేజా తడబడుతుండటంతో గుజరాత్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. బీసీసీఐ సెక్రటరీ జైషాతో పాటు గుజరాత్ యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, రాహుల్ తెవాటియా సంబరాలు చేసుకోగా.. చెన్నై అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. కానీ ఇక్కడే ఆశిష్ నెహ్రా కోచ్గా ఘోర తప్పిదం చేశాడు. మంచి మూమెంటమ్తో బౌలింగ్ చేస్తున్న మోహిత్ శర్మకు అనవసర సలహాలు ఇచ్చాడు.
వాటర్ బాయ్తో అతనికి ప్రత్యేక సందేశం పంపించాడు. బౌలింగ్ ప్రణాళికలో మార్పు చేయాలని సూచించినట్లు అర్థమైంది. చివరి రెండు బంతులు వేసేందుకు టైమ్ తీసుకోవడంతో జడేజా ఊపిరి తీసుకున్నాడు. ఒత్తిడిని పక్కనపెట్టి స్వేచ్చగా భారీ షాట్లు ఆడగలిగాడు. నాలుగు బంతులను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన మోహిత్ శర్మ.. నెహ్రా అనవసర సూచనలతో పాటు హార్దిక్ పాండ్యా చిట్ చాట్తో ఒత్తిడికి గురయ్యాడు.
యార్కర్ వేసే ప్రయత్నంలో ఐదో బంతి స్లాట్లో పడగా జడేజా లాంగాన్ దిశగా సిక్సర్ బాదాడు. దీంతో మరింత ఒత్తిడికి గురైన మోహిత్ శర్మ.. చివరి బంతిని లైన్ మిస్సై లెగ్ స్టంప్ దిశగా లో ఫుల్ టాస్ వేయగా.. జడేజా షార్ట్ ఫైన్ లెగ్ దిశగా బౌండరీ రాబట్టి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. మోహిత్ శర్మకు ఎలాంటి సూచనలు చేయకుండా అలానే వదిలేస్తే అతను కట్టుదిట్టంగా వేసేవాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.