
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భారత స్టార్ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, యుజ్వేంద్ర చాహల్కు తగిన గుర్తింపు దక్కలేదని టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే అన్నాడు. గొప్పగా రాణిస్తున్నప్పటికీ వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని చెప్పాడు. ఓ చానల్తో మాట్లాడిన అనిల్ కుంబ్లేకు ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ రేటింగ్ ఉన్న ఆటగాడు ఎవరనే ప్రశ్న ఎదురైంది. దానికి కుంబ్లే మయాంక్ అగర్వాల్, యుజ్వేంద్ర చాహల్ల పేర్లు చెప్పాడు.
'బ్యాటింగ్ విభాగంలో మయాంక్ అగర్వాల్కు, బౌలింగ్ విభాగంలో యుజ్వేంద్ర చాహల్కు తగిన గుర్తింపు లభించలేదు. వారి ప్రదర్శనకు తగిన ప్రతిఫలం దక్కట్లేదనేది నా అభిప్రాయం. ఐపీఎల్లో చాహల్ ఏ జట్టుకు ఆడినా ఆ టీమ్స్ అదృష్టాలే మారిపోయాయి.'' అని అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్లో ఇప్పటి వరకు మయాంక్ అగర్వాల్ 113 మ్యాచులు ఆడి 2327 పరుగులు చేశాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఒక సెంచరీ, 12 హాఫ్ సెంచరీలు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 21 టెస్టులు 5 వన్డేలు ఆడిన మయాంక్ అగర్వాల్కు టీ20ల్లోనే ఇంతవరకూ చోటు దక్కలేదు.

ఐపీఎల్ 2023 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ మయాంక్ అగర్వాల్ను రూ. 8.25 కోట్ల భారీ ధరకు తీసుకుంది. గత సీజన్ వరకు పంజాబ్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహించిన మయాంక్ అగర్వాల్.. ఆశించిన ఫలితం తీసుకురాకపోవడంతో ఆ ఫ్రాంచైజీ వేటు వేసింది. ఇక యుజ్వేంద్ర చాహల్ ఇప్పటి వరకు 131 ఐపీఎల్ మ్యాచులు ఆడి 166 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ చాహల్ గొప్పగానే రాణించాడు.
టీ20 ఫార్మాట్లో 91 వికెట్లు తీశాడు. వన్డేల్లో 121 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2022లో అతన్ని రాజస్థాన్ రాయల్స్ రూ. 6.50 కోట్లతో కొనుగోలుచేసింది. ఈ ఏడాది మార్చిలో జరగబోయే ఐపీఎల్ సీజన్కూ అదే జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లోనూ అతను జట్టులో ఉన్నాడు. కానీ కుల్దీప్ యాదవ్ కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు.