
చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మరో రెండేళ్ల పాటు ఐపీఎల్ ఆడుతాడని ఆ జట్టు స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) అన్నాడు. ఈ ఏడాదే ధోనీ (MS Dhoni)కి చివరి సీజన్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని రాయుడు కొట్టిపారేసాడు. మహేంద్ర సింగ్ ధోనీ చాలా ఫిట్గా ఉన్నాడని, అతనితో కుర్రాళ్లు కూడా పోటీ పడలేరని చెప్పుకొచ్చాడు.
2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ.. అప్పటి నుంచి ఒక్క ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అంతర్జాతీయ రిటైర్మెంట్ నుంచి ప్రతీ సీజన్ ధోనీకి చివరిదనే ప్రచారం జరుగుతుంది. గతేడాది అతని రిటైర్మెంట్ గురించి ప్రశ్నించగా.. సొంతమైదానంలో ఆడాలనుందని ధోనీ తెలిపాడు.
దాంతో ఈ సీజనే ధోనీకి చివరిదని అంతా అనుకుంటున్నారు. కానీ అంబటి రాయుడు మాత్రం మరో రెండేళ్ల పాటు ఆడుతాడని తెలిపాడు. 'ధోనీ రిటైర్మెంట్ గురించి సంకేతాలేమీ లేవు. ధోనీ మంచి టచ్లో ఉన్నాడు. అందరి కంటే ఎక్కువ ఫిట్గా ఉన్నాడు. నెట్స్లో, ప్రాక్టీస్ మ్యాచ్ల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో రెండు సీజన్లు ఆడతాడని అనుకుంటున్నా. ఫిట్నెస్ విషయంలో ధోనీతో కుర్రాళ్లు కూడా పోటీపడలేరు.
ఐపీఎల్ జట్లన్నింటిలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమాన గణం చాలా స్పెషల్. వీళ్లు ఆటగాళ్లను చాలా ఉన్నతంగా చూస్తారు. సోమవారం ప్రాక్టీస్ మ్యాచ్ కోసం మూడు స్టాండ్లలో అభిమానులకు అనుమతివ్వగా అన్నీ నిండిపోయాయి. ధోనీ.. ధోనీ అంటూ స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. మళ్లీ చెన్నైలో ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈసారి పూర్తిస్థాయి స్టేడియం అందుబాటులోకి వచ్చింది. కాబట్టి అన్ని మ్యాచ్లకు స్టేడియం నిండిపోవడం ఖాయం.
ఈసారి జట్టులో బెన్ స్టోక్స్ ఉండటం కచ్చితంగా కలిసొచ్చే అంశమే. షేన్ వాట్సన్ తర్వాత జట్టులో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లోటు కనిపించింది. 2018, 2021లలో చెన్నై విజయాల్లో షేన్ వాట్సన్ కీలకపాత్ర పోషించాడు. సామ్ కరణ్ వచ్చినా గాయంతో అతను ఆడలేదు. ఇప్పుడు స్టోక్స్తో ఆ లోటు భర్తీ అయ్యింది. రవీంద్ర జడేజా, మొయిన్ అలీలకు స్టోక్స్ తోడవడంతో అత్యుత్తమ ఆల్రౌండర్లకు చెన్నై కేరాఫ్ అడ్రస్గా మారింది.
ఇక ధోనీ నుంచి చాలా విషయాలు నేర్చకున్నా. ప్రత్యేకంగా ఒత్తిడి సమయాల్లో ప్రశాంతంగా ఉండటం ఎలాగో తెలుసుకున్నా. గతం, భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించకుండా వర్తమానంలో ఉండటం అలవాటైంది. మైదానంలో, బయట ధోనీతో కలిసున్న ప్రతి క్షణం మాకందరికీ ఒక పాఠమే.'అని రాయుడు చెప్పుకొచ్చాడు.