
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతాడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడని ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు. ఈ సారి ఆర్సీబీ చాలా పటిష్టంగా కనిపిస్తుందని, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలో ఆర్సీబీ మెరుగైన ప్రదర్శన చేస్తుందని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2023 సీజన్ మరో 8 రోజుల్లో ప్రారంభం కానుండగా.. ఫ్రాంచైజీలన్నీ ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆయా టీమ్స్ బలాలు బలహీనతలను విశ్లేషించాడు.
ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ గురించి మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ ఓపెనింగ్ చేయాలని, రజత్ పాటిదార్ను ఫస్ట్ డౌన్లో ఆడించాలని సూచించాడు. 'ఆర్సీబీలో ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీలలో ఎవరు అత్యధిక పరుగులు చేస్తారని ప్రశ్నిస్తే.. నేను విరాట్ కోహ్లీ వైపు మొగ్గుచూపుతాను. గతేడాది విరాట్ కోహ్లీ ఆశించిన మేరకు పరుగులు చేయలేదు. ప్రతీ ఏడాది అలా జరగదు. అతను ఈ సారి ఖచ్చితంగా రాణిస్తాడు. ఆర్సీబీ టీమ్ కూడా బలంగా కనిపిస్తోంది. ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో వారికి చాలా మంచి కెప్టెన్ ఉన్నాడు.

బ్యాటింగ్ ఆర్డర్ విషయానికొస్తే.. ఫాఫ్ డుప్లెసిస్తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయాలి. మూడో స్థానంలో రజత్ పాటిదార్ను ఆడించాలి. తర్వాత గ్లేన్ మ్యాక్స్వెల్, మహిపాల్ లోమ్రార్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తిక్లను ఆడించాలి. విల్ జాక్స్ స్థానంలో న్యూజిలాండ్ బిగ్ హిట్టర్ మైఖేల్ బ్రేస్వెల్ను తీసుకుని ఆర్సీబీ మంచి పని చేసింది. టీ20 ఫార్మాట్కు తగ్గట్లు మైఖేల్ బ్రేస్వెల్ దూకుడుగా ఆడతాడు' అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
గతేడాది 22.73 సగటుతో 341 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. ఈ సారి సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆసియా కప్ 2022లో అఫ్గానిస్థాన్పై సెంచరీ బాదిన విరాట్.. వన్డేల్లో వరుసగా రెండు శతకాలు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్లోనూ సెంచరీ బాదాడు. ఐపీఎల్లోనూ అతను ఇదే జోరు కొనసాగిస్తే ప్రత్యర్థి జట్లకు తిప్పలు తప్పవు.