
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ కూడా చేరదని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. పేపర్పై టీమ్ బలంగా కనిపిస్తున్నా.. సరైన కాంబినేషన్ లేదన్నాడు. రోడ్డు ప్రమాదంతో కెప్టెన్ రిషభ్ పంత్ దూరమవ్వడం ఆ జట్టుకు సమస్యగా మారిందన్నాడు. జట్టు నిండా స్టార్లు ఉన్నా వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారనేది తెలియడం లేదన్నాడు.
రిషభ్ పంత్ గైర్హాజరీలతో డేవిడ్ వార్నర్కు ఢిల్లీ సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కాంబినేషన్పై తన యూట్యూబ్ చానెల్ వేదికగా విశ్లేషించిన ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు ఎలా ఉంటుందా? అనేదానిపై నాకు ఆసక్తి నెలకొంది. పృథ్వీ షాతో కలిసి డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. మిచెల్ మార్ష్ను మూడో స్థానంలో ఆడించవచ్చు. నాలుగో స్థానంలో మనీశ్ పాండే రూపంలో ఓ సీనియర్ ప్లేయర్ అందుబాటులో ఉన్నాడు.
అయితే వికెట్ కీపర్ ఎవరా? అనేది తెలియడం లేదు. మనీశ్ పాండే, మిచెల్ మార్ష్ వికెట్ కీపింగ్ చేయలేరు. రిలే రసో, రోవ్మన్ పావెల్లను ఐదు, ఆరు స్థానాల్లో ఆడించి, సర్ఫరాజ్ ఖాన్ను ఏడో స్థానంలో బరిలోకి దించే అవకాశం ఉంది. అయితే సర్ఫరాజ్ ఖాన్ కూడా కీపింగ్ చేయలేడు. కీపింగ్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి.
అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్.. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్లతో ఢిల్లీ క్యాపిటల్స్ చూడడానికి పటిష్టంగానే ఉంది. అయితే జట్టులో అక్షర్ పటేల్ మినహా మరో ఆల్రౌండర్ లేడు. అక్షర్ పటేల్ తప్ప ఢిల్లీ టీమ్లో బ్యాటర్లు బౌలింగ్ చేయలేరు. బౌలర్లు బ్యాటింగ్ చేయలేరు.
అన్రీచ్ నోర్జ్, చేతన్ సకారియా, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్.. ఢిల్లీ టీమ్లో ఫాస్ట్ బౌలర్లు బాగానే ఉన్నారు. ఇప్పటిదాకా పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ గెలవలేకపోయాయి. ఈసారి అయినా ఇవి టైటిల్ గెలుస్తాయా? అంటే నాకైతే అంత సీన్ కనిపించడం లేదు. నా ఉద్దేశంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ప్లేఆఫ్స్ చేరడం కూడా కష్టమే.' అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. మార్చి 31న ఐపీఎల్ 2023 సీజన్కు తెరలేవనుంది.