హైదరాబాద్: అనూహ్యా ఘటనలు.. సంచలన ప్రదర్శనలకు ఐపీఎల్ 2023 సీజన్ కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. అనామక ఆటగాళ్లు అనూహ్య ప్రదర్శనలతో చెలరేగుతుంటే.. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆటగాళ్లు దారుణంగా విఫలమవుతున్నారు.
సునాయసంగా గెలవాల్సిన కొన్ని జట్లు ఓటమి పాలవుతుంటే.. మరికొన్ని టీమ్స్ సంచలన ప్రదర్శనతో ఫలితాలను తారుమారు చేస్తున్నాయి. మొత్తానికి అన్ప్రెడిక్టబుల్గా ఐపీఎల్ 2023 సీజన్ అభిమానులను అలరిస్తోంది.

చెత్త ప్రదర్శనతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను ఈ సీజన్కు ముందు కొన్ని ఫ్రాంచైజీలు వదిలేయగా.. వారే అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. 'ఎవరు రా.. నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్?'అని పాత ఫ్రాంచైజీలు అనుకునే విధంగా ఆడుతూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
ఓ ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్ 2023 సీజన్లో సంచలన ప్రదర్శనతో పాత్ర ఫ్రాంచైజీలకు గట్టి షాకిచ్చారు. గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన నికోలస్ పూరన్ దారుణంగా విఫలమవ్వడంతో ఆ జట్టు వదులుకుంది. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని రూ.16 కోట్ల భారీ ధరకు తీసుకోగా అందరూ నవ్వుకున్నారు.
కానీ పూరన్ సంచలన బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. ఆర్సీబీతో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. దాంతో సన్రైజర్స్ అభిమానులు.. ఒక్క మ్యాచ్ అయినా మా తరఫున ఇలా ఆడి ఉండొచ్చు కదన్నా.. అని కామెంట్ చేస్తున్నారు.
గతంలో సన్రైజర్స్కే ఆడిన విజయ్ శంకర్ గుజరాత్ తరఫున దుమ్మురేపుతున్నాడు. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదాడు. 'నీలో ఇంత హిట్టింగ్ పవర్ ఉందా అన్నా'అంటూ సన్రైజర్స్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
సీఎస్కే తరఫున బరిలోకి దిగిన అజింక్యా రహానే సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు. వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా రహానే కోసం బిడ్ వేయకపోగా.. కనీస ధరకు సీఎస్కే కొనుగోలు చేసింది. అతని బ్యాటింగ్ చూసి పాత ఫ్రాంచైజీ కేకేఆర్ షాక్కు గురవుతోంది.