
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్ ఆరంభం నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకే ఆడుతున్న విషయం తెలిసిందే. అనామక ఆటగాడిగా ఆ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్.. తనదైన ఆటతో అంచలంచెలుగా ఎదిగాడు. సుదీర్ఘ కాలం పాలు ఆ జట్టుకు సారథిగా సేవలందించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఆరంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించిన ఆటగాడిగా కూడా విరాట్ చరిత్రకెక్కాడు. గత సీజన్తోనే ఆ జట్టు సారథ్య బాధ్యతలకు గుడ్ బై చెప్పిన విరాట్ ఆటగాడిగానే జట్టులో కొనసాగుతానని స్పష్టం చేశాడు. తన ఐపీఎల్ కెరీర్ చివరి మ్యాచ్ కూడా ఆర్సీబీ తరఫునే ఆడుతానన్నాడు.
ఆర్సీబీతో అంతటి అనుబంధం ఏర్పరుచుకున్న విరాట్ కోహ్లీ.. తాజాగా ఫ్రాంచైజీకి సంబంధించిన షాకింగ్ విషయాలను పంచుకున్నాడు. కెరీర్ ఆరంభంలో ఆర్సీబీ తనను ఘోరంగా అవమాన పరిచిందని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా ఆ జట్టు నిర్వహించిన పోడ్కాస్ట్ కార్యక్రమంలో మాట్లాడిన విరాట్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
2008 ఆరంభ సీజన్ తర్వాత ఆర్సీబీ తన పట్ల దారుణంగా వ్యవహరించిందన్నాడు. తొలి సీజన్లో 15 సగటుతో కేవలం 165 పరుగులు మాత్రమే చేయడంతో తనను ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకునుందుకు డొక్కు ఓమ్నీ కారును పంపిందని, మిగతా ఆటగాళ్లకైతే ఏసీ కార్లు వెళ్లాయని, ఆ అనుభవం తనను బాగా కలచి వేసిందని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ మొదటి మూడు సీజన్లలో తన పారితోషికం కేవలం రూ. 12 లక్షలు మాత్రమేనని కోహ్లీ గుర్తు చేశాడు. అది తాను మరిచిపోలేని అత్యంత దారుణమైన అనుభవమన్నాడు. ఇక స్టార్ ఆటగాళ్లను కలవడం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని చెప్పుకొచ్చాడు.
ఆర్సీబీ తరఫున పరుగుల వరద పారించిన కోహ్లీ లీగ్లోనే హయ్యెస్ట్ రన్ స్కోరర్గా నిలిచాడు. మరెన్నో మైలురాళ్లు నెలకొల్పాడు. ఓ ఆటగాడిగా ఇంత చేసిన విరాట్.. కెప్టెన్గా మాత్రం విఫలమయ్యాడు. ఆర్సీబీకి ఒక్కసారి కూడా టైటిల్ అందించలేకపోయాడు. 2016 ఫైనల్లో తృటిలో టైటిల్ చేజార్చుకున్నాడు. టైటిల్ గెలవకపోవడమనేది అతని కెరీర్పై తీవ్ర ప్రభావం చూపింది. అంతర్జాతీయ సారథ్య బాధ్యతలను కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.