
చిన్న మైదానాలు..
కరోనా కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ను బీసీసీఐ మహారాష్ట్రకే పరిమితం చేసిన విషయం తెలిసిందే. బయోబబుల్ బ్రేక్ అవ్వకూడదనే ఉద్దేశంతో విమాన ప్రయాణాలు లేకుండా బస్సులో వెళ్లే విధంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకుంది. ముంబై పరిసిర ప్రాంతాల్లోనే ఉన్న వాంఖడే, డీవై పాటిల్, బ్రాబౌర్న్, పుణే మైదానాలను లీగ్ మ్యాచ్ల కోసం ఖరారు చేసింది. లీగ్ దశ సక్సెస్ ఫుల్గా ముగిసిన తర్వాత అహ్మదాబాద్ వేదికగా ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్లను నిర్వహిస్తామని పేర్కొంది. అయితే ముంబైలోని అన్ని మైదానాల్లో బౌండరీలు దగ్గరగా ఉంటాయి. పైగా ఇవన్నీ బ్యాటింగ్కు అనుకూలమైన ఫ్లాట్ వికెట్స్.

మంచు ప్రభావం..
ఇక రాత్రి వేళల్లో ఇక్కడ విపరీతమైన డ్యూ(మంచు) కురుస్తుంది. ఇది మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపనుంది. దాంతోనే నిన్న జరిగిన రెండు మ్యాచ్ల్లో భారీ స్కోర్లు నమోదవ్వగా.. బౌలర్లు తేలిపోయారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్లోనే అత్యంత చెత్త గణంకాలు నమోదు చేశాడు. ఈ మైదానాల్లో కాస్తో కూస్తో స్పిన్నర్లే రాణించగలుగుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే టోర్నీ సాగుతున్న కోద్దీ బౌలర్లకు చుక్కలు తప్పేలా లేవని విశ్లేషకులు అంటున్నారు.

టాస్ కీ రోల్...
బౌలర్ల కెరీర్ నాశనమయ్యే ఘటనలు కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. టాస్ కూడా కీలకం కావడంతో కెప్టెన్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ల్లో టాస్ గెలిచి చేజింగ్ తీసుకున్న జట్లే విజయాలందుకున్నాయి. దాంతో టాస్ కీలకం అవుతుంది. ఫస్ట్ పవర్ ప్లేలో బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్లు ఆ తర్వాత బ్యాటింగ్ అనుకూలంగా మారిపోతున్నాయి. దాంతో బౌలర్లు పరుగులు కట్టడి చేసేందుకు తెగ కష్టపడాల్సి వస్తోంది.

బీసీసీఐ సైతం..
ధనాధన్ బ్యాటింగ్కే అభిమానులు ఇష్టపడుతుండటంతో బీసీసీఐ కూడా ఆ రకమైన పిచ్లనే సిద్దం చేయిస్తోంది. మ్యాచ్లు జరిగిన కొద్దీ పిచ్లు జీవం పోయి బ్యాటింగ్కు ప్రతికూలంగా మారుతాయని అనుకుందామంటే..? అలా జరగకుండా బీసీసీఐ గొప్ప ఆలోచన చేసింది. ఒక్కో వేదికల్లో 5 వికెట్లను సిద్దం చేస్తుంది. దాంతో ఒక్క వికెట్పై గరిష్టంగా 5 మ్యాచ్లే జరగనున్నాయి. కాబట్టి నెమ్మదించే అవకాశం కూడా లేదు. పైగా బ్యాటర్లు విభిన్నమైన షాట్లతో బౌండరీలకు తరలిస్తున్నారు.


Click it and Unblock the Notifications
