
ముంబై: ముంబై ఇండియన్స్ యువ ప్లేయర్, హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ (33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత పిన్న వయసులో ఈ ఘనతను అందుకున్న ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ క్రమంలోనే ముంబై స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇషాన్ కిషన్ 19 ఏళ్ల 278 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించగా.. తిలక్ వర్మ 19 ఏళ్ల 145 రోజుల వయసులో ఈ ఘనత సాధించి అతన్ని అధిగమించాడు.
ఇక కెరీర్లో రెండో ఐపీఎల్ మ్యాచ్లోనే తిలక్ హాఫ్ సెంచరీతో రాణించడం విశేషం. 40 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై జట్టును తిలక్ ఆదుకున్నాడు. ఇషాన్ కిషాన్తో కలిసి రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్.. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడుతున్నాడు. స్విచ్ హిట్స్తో ఎంతో అనుభవం ఉన్న అశ్విన్నే బెంబేలెత్తించాడు. అయితే అతని బౌలింగ్లోనే మరో భారీ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మెగా వేలంలో తిలక్ను ముంబై రూ.1.70 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయగా... ఆ ధరకు అతను మూడింతల న్యాయం చేశాడు.
తిలక్ హాఫ్ సెంచరీతో చెలరేగిన ముంబైకి విజయం దక్కలేదు. ఆఖరి ఓవర్ వరకు రసవత్తరంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోస్ బట్లర్(68 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్లతో 100) సెంచరీతో చెలరేగగా.. షిమ్రాన్ హెట్మైర్(14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 35), సంజూ శాంసన్(21 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 30)తుఫాను ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో బుమ్రా, టైమిల్ మిల్స్ మూడు వికెట్లు తీయగా.. కీరన్ పొలార్డ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేసింది. ఇషాన్ కిషన్(43 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 54), తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, సైనీ రెండేసి వికెట్లు తీయగా.. బౌల్ట్, ప్రసిధ్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.