
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ హైదరాబాద్ క్రికెటర్... రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. ఢిల్లీతో జరిగిన తన అరంగేట్ర మ్యాచ్లోనే చూడ ముచ్చటైన షాట్లు ఆడిన తిలక్ వర్మ.. తాజా మ్యాచ్లో ఆ ప్రదర్శనను రెట్టింపు చేశాడు. 40 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై జట్టును తిలక్ ఆదుకున్నాడు.
ఇషాన్ కిషాన్తో కలిసి రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్.. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడుతున్నాడు. స్విచ్ హిట్స్తో ఎంతో అనుభవం ఉన్న అశ్విన్నే బెంబేలెత్తించాడు. అయితే అతని బౌలింగ్లోనే మరో భారీ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక తిలక్కు ఇదే ఫస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇషాన్ కిషన్తో మూడో వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్.. జట్టను విజయం దిశగా నడిపించాడు.
టాలెంటెడ్ ఆటగాళ్లను పట్టుకురావడంలో ముంబై ఇండియన్స్కు తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. తెలుగు జట్టు అయిన సన్రైజర్స్ హైదరాబాద్.. తిలక్ వర్మను పట్టించుకోకపోగా ముంబై రూ.1.70 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ ధరకు తిలక్ మూడింతల న్యాయం చేశాడు. అండర్ 19 ప్రపంచకప్ ఆడిన అనుభవం ఉన్న తిలక్ వర్మ భవిష్యత్తులో స్టార్గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తిలక్ వర్మ ఇన్నింగ్స్ చూసిన తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ తలబాదుకుంటుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
తిలక్ హాఫ్ సెంచరీతో చెలరేగిన ముంబైకి విజయం దక్కలేదు. ఆఖరి ఓవర్ వరకు రసవత్తరంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోస్ బట్లర్(68 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్లతో 100) సెంచరీతో చెలరేగగా.. షిమ్రాన్ హెట్మైర్(14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 35), సంజూ శాంసన్(21 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 30)తుఫాను ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో బుమ్రా, టైమిల్ మిల్స్ మూడు వికెట్లు తీయగా.. కీరన్ పొలార్డ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేసింది. ఇషాన్ కిషన్(43 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 54), తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, సైనీ రెండేసి వికెట్లు తీయగా.. బౌల్ట్, ప్రసిధ్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.