
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, స్టార్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా ఆటగాడిగా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సురేశ్ రైనాను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపని విషయం తెలిసిందే. తన పాత ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్తో పాటు సొంత రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్న లక్నోటీమ్ కూడా సురేశ్ రైనాను తీసుకోకపోవడానికి ముందుకు రాకపోవడంతో అతను అన్సోల్డ్ లిస్ట్లో చేరాడు. ఐపీఎల్ ఐకాన్ ప్లేయర్గా గుర్తింపు పొందిన సురేశ్ రైనాను కనీస ధరకు కూడా ఫ్రాంచైజీలు కనకరించకపోవడం అభిమానులను కలిచి వేసింది.
అయితే ఐపీఎల్లో అమ్ముడుపోని జాబితాలో నిలిచిన సురేశ్ రైనా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా నెట్టింట వైరల్గా మారింది. భారత ఆటగాళ్లు ఇతర దేశాల క్రికెట్ లీగ్స్ ఆడేలా అనుమతివ్వాలని సురేశ్ రైనా బోర్డును విజ్ఞప్తి చేశాడు. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్), కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) ఆడేందుకు మార్గం సుగుమం అవుతుందన్నాడు.
బీసీసీఐ గైడ్లైన్స్ ప్రకారం బోర్డు కాంట్రాక్టు కలిగిన పురుష క్రికెటర్లు వీదేశీ లీగ్స్ ఆడటానికి వీలు లేదు. భారత్లో అన్ని రకాల ఆటకు గుడ్ బై చెబితనే ఇతర దేశాల లీగ్లు ఆడేందుకు అవకాశం దక్కుతుంది. అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న సురేశ్ రైనా.. ఐపీఎల్తో పాటు దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి విదేశీ లీగ్లు ఆడే అవకాశం లేకుండా పోయింది. గతంలో కూడా సురేశ్ రైనా ఈ వాదన వినిపించాడు. బీసీసీఐ కాంట్రాక్ట్స్ లేని భారత ఆటగాళ్లు ఓవర్సీస్ లీగ్స్ ఆడేందుకు అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చిన సురేశ్ రైనాను.. ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం ఇదే తొలిసారి. అతని వయసు, ఫామ్ను దృష్టిలో ఉంచుకొని చెన్నై.. అతన్ని తీసుకోలేదు. పైగా గత సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన అతను కేవలం 160 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా ఫిట్నెస్ సంబంధిత సమస్యలతో బాధపడ్డాడు. ఈ కారణంతోనే ఫ్రాంచైజీలు అతన్ని తీసుకునేందుకు వెనుకడుగు వేసాయి.