
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించినా ఆరెంజ్ ఆర్మీ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ఇది హైదరాబాద్కు వరుసగా 5వ విజయం. తొలి రెండు మ్యాచ్ల్లో చిత్తుగా ఓడిన హైదరాబాద్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. ముఖ్యంగా టీమ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా మారింది.ఆడిన ఏడు మ్యాచ్ల్లో కేన్ విలియమ్సన్ టాస్ గెలవడం విశేషం. ఈ భారీ విజయంతో రన్రేట్ను మెరుగుపరుచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్కు వెళ్లింది. ఈ ఘోర పరాజయంతో ఆర్సీబీ నాలుగో స్థానానికి పడిపోయింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. 16.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. సుయాశ్ ప్రభుదేశాయ్(15), గ్లేన్ మ్యాక్స్వెల్(11) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. విరాట్ కోహ్లీ(0)తో పాటు అనూజ్ రావత్(0), దినేశ్ కార్తీక్(0) డకౌట్గా వెనుదిరిగారు. సన్రైజర్స్ హైదరబాద్ బౌలర్లు మార్కో జాన్సెన్(3/25), నటరాజన్(3/10) మూడేసి వికెట్లు తీయగా.. జగదీష్ సుచీత్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్లకు తలో వికెట్ దక్కింది.
అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ 8 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 72 పరుగులు చేసి 72 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 47) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. కేన్ విలియమ్సన్(16 నాటౌట్), రాహుల్ త్రిపాఠి(7 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.
69 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు మంచి శుభారంభం దక్కింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మూడు పరుగులే వచ్చినా.. హజెల్ వుడ్ వేసిన మరుసటి ఓవర్లో అభిషేక్ బౌండరీ బాదాడు. సిరాజ్ వేసిన మూడో ఓవర్లో ఓ భారీ సిక్సర్తో పాటు బౌండరీ బాదిన అభిషేక్.. హజెల్ వుడ్ బౌలింగ్లో మరో రెండు బౌండరీలు బాదాడు. హర్షల్ పటేల్ వేసిన ఐదో ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన అతను.. హజెల్ వుడ్ వేసిన 6వ ఓవర్లో మరో రెండు బౌండరీలు కొట్టాడు.
దాంతో పవర్ ప్లేలోనే సన్రైజర్స్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఆ తర్వాత ఫాఫ్ హసరంగాను రంగంలోకి దించగా.. కేన్ మామ ఫస్ట్ బాలే బౌండరీ బాదాడు. ఈ ఓవర్లో కేన్ విలియమ్సన్ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన అభిషేక్ శర్మ.. హర్షల్ పటేల్ వేసిన 8వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి భారీ సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు.