
ముంబై: ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అసిస్టెంట్ కోచ్గా నియమితుడయ్యాడు. మరో 11 రోజుల్లో
ప్రారంభం కానున్న ఐపీఎల్- 2022 సీజన్ నుంచి అతను ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఢిల్లీ జట్టుకు ఇప్పటికే ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తుండగా.. ప్రవీణ్ ఆమ్రే, అజిత్ అగార్కర్ అసిస్టెంట్ కోచ్లుగా పని చేస్తున్నారు. జేమ్స్ హోప్స్ బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్కు అసిస్టెంట్ కోచ్గా చేసే అవకాశం రావడంపై షేన్ వాట్సన్ సంతో షం వ్యక్తం చేశాడు. 'టీ20 ఫార్మాట్లో ఐపీఎల్కు ప్రత్యేక స్థానం ఉంది. ఓ ఆటగాడిగా ఈ టోర్నీలో నాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. 2008లో షేన్ వార్న్ సారథ్యంలో మా జట్టు (రాజస్థాన్ రాయల్స్) ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్లకు ఆటగాడిగా సేవలందించాను. ప్రస్తుతం కోచ్గా బాధ్యతలు చేపట్టడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. దిగ్గజ క్రికెటర్గా, కెప్టెన్గా ఎన్నో ఘనతలు సాధించిన రికీ పాంటింగ్ నేతృత్వంలో పని చేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను' అని షేన్ వాట్సన్ పేర్కొన్నాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్గా పేరు పొందిన షేన్ వాట్సన్కు ఐపీఎల్లోనూ మెరుగైన రికార్డే ఉంది. వాట్సన్ గతంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐపీఎల్లో 145 మ్యాచులు ఆడిన వాట్సన్ 3874 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలు, 21 అర్ధ శతకాలు ఉన్నాయి. అలాగే, బంతితోనూ 92 వికెట్లు పడగొట్టాడు. 2019 ఐపీఎల్ ఫైనల్లో షేన్ వాట్సన్ అద్భుత బ్యాటింగ్ చేశాడు. మొకాలికి గాయమై రక్తం కారుతున్నా.. క్రీజులో నిలబడి జట్టును విజయం దిశగా నడిపించాడు. కానీ ఆ మ్యాచ్లో సీఎస్కే ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.