
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 మెగా వేలం పూర్తయిన నేపథ్యంలో షెడ్యూల్ ఖరారుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కసరత్తులు మొదలు పెట్టింది. నేడు(గురువారం) జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో షెడ్యూల్, వేదికలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇంకా షెడ్యూల్ విడుదల కానప్పటికీ.. లీగ్ మ్యాచ్లు ముంబై, పుణేల వేదికలుగా నిర్వహించాలనే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ముంబైలో 55 లీగ్ మ్యాచ్లను నిర్వహించేందుకు ప్లాన్ రెడీ అయింది. వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో ఈ మ్యాచ్లను షెడ్యూల్ చేయనున్నారు. అదే టైమ్లో రిలయన్స్ స్టేడియాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. పుణెలోని ఏంసీఏ స్టేడియంలో 15 గ్రూప్ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. మార్చి 26న లీగ్ స్టార్ట్ చేసి మే 29న ఫైనల్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్లేఆఫ్స్ వేదికలు ఇంకా ఖరారు కాలేదు. లీగ్లోకి కొత్తగా రెండు ఫ్రాంఛైజీలు ఎంట్రీ ఇవ్వడంతో ఐపీఎల్ జట్ల సంఖ్య పదికి పెరగడంతో మ్యాచ్ల సంఖ్య కూడా పెరిగింది.
వాస్తవానికి మార్చి 27న లీగ్ మొదలుపెట్టాలని బోర్డు ముందుగా అనుకుంది. ఆ రోజు ఆదివారం కాగా.. ఒక రోజు ముందగా శనివారం లీగ్ స్టార్ట్ చేస్తే.. తర్వాతి రోజు ఆదివారం డబుల్ హెడర్(రెండు మ్యాచ్లు) జరిపే వీలుంటుందని అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ ఇండియా రిక్వెస్ట్ చేయడంతో మనసు మార్చుకుంది.
దానివల్ల ఫస్ట్ వీకెండ్లోనే మూడు మ్యాచ్లు నిర్వహిస్తే.. 15వ సీజన్పు ఫుల్ జోష్తో మొదలు పెట్టొచ్చన విషయాన్ని స్టార్ ఇండియా బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై బ్రాడ్కాస్టర్తో బోర్డు పెద్దలు చర్చలు జరుపుతున్నారు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ మార్చి 16న పూర్తవుతుంది కాబట్టి లీగ్ను ఒక రోజు ముందుకు జరపడం వల్ల భారత ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, దీనివల్ల ఆస్ట్రేలియా ప్లేయర్లు మాత్రం లీగ్లో మరో మ్యాచ్ను మిస్సయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ పర్యటన ఉన్న నేపథ్యంలో వారంతా ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నారు. ఏప్రిల్ 6 తర్వాతే మ్యాచ్లకు అందుబాటులోకి రానున్నారు. వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య సిరీస్ల నేపథ్యంలో ఈ రెండు దేశాల ఆటగాళ్లు ఏప్రిల్ 5న అందుబాటులోకి రానున్నారు.