

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ పేలవ ప్రదర్శనతో ప్రారంభించాడు. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. రెండు బంతులు ఆడి.. ఒక్క పరుగు మాత్రమే చేసిన పంత్.. రోహిత్ శర్మ మార్క్ కెప్టెన్సీకి వెనుదిరిగాడు. భారత జట్టు కెప్టెన్గా రిషభ్ పంత్ బలహీనతను పసిగట్టిన రోహిత్... దాన్నే టార్గెట్ చేస్తూ ఫలితం రాబట్టాడు. ఊరించే షార్ట్ పిచ్ బంతితో టెంప్ట్ చేసి.. దానికి తగ్గ ఫీల్డ్ను సెట్ చేయగా.. ముందు వెనుకా ఆలోచించకుండా ఉరుకులాడిన పంత్... మూల్యం చెల్లించుకున్నాడు.
ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా 5వ ఓవర్ వేసిన టైమల్ మిల్స్ మొదటి బంతిని వైడ్ వేశాడు. రెండో బంతి వేయడానికి ముందు రోహిత్ అతని దగ్గరకు వచ్చి షార్ట్ పిచ్ బాల్ వేయాలని చెప్పాడు. వెంటనే దానికి తగ్గట్లు థర్డ్మ్యాన్ పొజిషన్లో ఫీల్డింగ్ సెట్ చేశాడు. కాగా టైమల్ మిల్స్ ఎక్స్ట్రా బౌన్స్తో విసిరిన బంతిని పంత్ థర్డ్మన్ దిశగా భారీ షాట్ ఆడాడు .అంతే బంతి నేరుగా వెళ్లి అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న టిమ్ డేవిడ్ చేతిలో పడింది. దాంతో రోహిత్ తనలో తానే నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇషాన్ కిషన్(48 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 81 నాటౌట్) షాన్దార్ ఇన్నింగ్స్తో ఫస్ట్ మ్యాచ్లోనే ముంబై ఇండియన్స్ ఢిల్లీ ముందు 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్కు తోడు కెప్టెన్ రోహిత్ శర్మ(32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 41), తిలక్ వర్మ(15 బంతుల్లో 3 ఫోర్లతో 22) రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ.. 104 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో లతిత్ యాదవ్ (35 బ్యాటింగ్), అక్షర్ పటేల్ (16 బ్యాటింగ్) ఉన్నారు. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. మిల్స్ ఓ వికెట్ పడగొట్టాడు. బసిల్ థంపికి మూడు వికెట్లు దక్కాయి. ఢిల్లీ విజయానికి 22 బంతుల్లో 38 పరుగులు అవసరం.