
ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఉద్దేశించిన వెటరన్ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్గా ఈ సీజన్కు విరాట్ చిన్న బ్రేక్ తీసుకున్నాడని, వచ్చే ఏడాది నుంచి మళ్లీ అతనే ఆర్సీబీ టీమ్ను నడిపిస్తాడని తెలిపాడు. ఇక జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు.. కావాల్సినంత పాపులారిటీ.. ఏ జట్టుకు లేనంత అభిమాన గణం ఉన్నా.. ఎందుకో ఆర్సీబీ ఇప్పటి వరకు టైటిల్ అందుకోలేకపోయింది.
2013 సీజన్ నుంచి పూర్తి స్థాయిలో ఆర్సీబీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లి.. టైటిల్ గెలవకుండానే తన సారథ్యానికి గుడ్బై చెప్పాడు. గత సీజన్తోనే ఆర్సీబీ కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో అనేక తర్జనభర్జనల అనంతరం సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ను ఆర్సీబీ తమ కొత్త సారథిగా ఎంపిక చేసింది.
ఈ నిర్ణయాన్ని మెచ్చుకున్న అశ్విన్.. అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందన్నాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ మాజీ అనలిస్ట్ ప్రసన్న అగోరమ్తో మాట్లాడిన అశ్విన్.. ఒత్తిడి తగ్గించుకునేందుకే విరాట్ కెప్టెన్సీ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాడని చెప్పాడు. 'ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్ కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. బహుషా మరో రెండు మూడేళ్ల పాటు ఆడతాడేమో! ఏదేమైనా... ఫాఫ్ను కెప్టెన్గా ఎంపిక చేయడం సరైన నిర్ణయం. అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది.
ఎంఎస్ ధోనీలోని కెప్టెన్సీ నైపుణ్యాలు తనలోనూ ఉన్నాయని డుప్లెసిసే చెప్పాడు కూడా. అయితే, ఫాఫ్ ఎక్కువ కాలం పాటు కెప్టెన్గా ఉండకపోవచ్చు. నిజానికి గత కొన్నేళ్లుగా కోహ్లీ కెప్టెన్సీ భారంతో ఒత్తిడికి గురవుతున్నాడు. అతనికి కాస్త విశ్రాంతి కావాలి. నాకు తెలిసి కోహ్లీ చిన్న బ్రేక్ తీసుకున్నాడనిపిస్తోంది. నా అంచనా ప్రకారం.. వచ్చే ఏడాది అతను మళ్లీ ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి'అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ఇక ఆర్సీబీ మార్చి 27న పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్తో టైటిల్ వేటను ప్రారంభించనుండగా.. మార్చి 29న సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ రాయల్స్.. తమ తొలి మ్యాచ్ ఆడనుంది.