
ఘనంగా ముగింపు వేడుకలు..
సాధారణంగా ఐపీఎల్ ఆరంభ, ముగింపు వేడుకలను బీసీసీఐ భారీ స్థాయిలో నిర్వహించేది. కానీ కరోనా పుణ్యమా అని 2020 నుంచి ప్రేక్షకులకు ఆ సంబురాలు కరువయ్యాయి. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ వేడుకలు కూడా జరుగలేదు. కానీ కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మే 29న జరిగే ఫైనల్కు ముందు ఈ వేడుకలు నిర్వహించాలని బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. ముగింపు వేడుకల్లో బాలీవుడ్ నటుడు, ఇటీవలే 83 సినిమాతో ప్రేక్షలకు అభిమానాన్ని చురగొన్న రణ్వీర్ సింగ్ తో పాటు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎఆర్ రెహ్మాన్ తో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకుంటుంది.

కెప్టెన్లందరికీ సన్మానం..
ఈ మేరకు ఒక ఏజెన్సీకి ఇందుకు సంబంధించిన పనులను కూడా అప్పజెప్పింది. మే 29న ఫైనల్ కు ముందు 45 నిమిషాల పాటు ఈ ఇద్దరూ తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారని టాక్. ఇందుకు గాను ఆ ఇద్దరికీ భారీ నజరానాను కూడా ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇటీవలే భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నది. 75 వసంతాల భారతావని లో టీమిండియాకు కెప్టెన్లు గా వ్యవహరించిన వారిని సత్కరించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఈ 75 ఏండ్లలో భారత క్రికెట్ ఎదుగుదల, ఆ ప్రయాణానికి సంబంధించిన ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించినట్టు సమాచారం. భారత జట్టు మాజీ సారథులందరినీ ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించేందుకు బీసీసీఐ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసిందని వార్తలు వస్తున్నాయి.

ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఫైనల్ వేదికలివి..
మే 24న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ లో తొలి ప్లేఆఫ్స్ (క్వాలిఫైయర్ టీమ్ 1 వర్సెస్ టీమ్ 2) జరుగుతుంది. మే 25 న అదే స్టేడియంలో ఎలిమినేటర్ (టీమ్ 3 వర్సెస్ టీమ్ 4) ను నిర్వహిస్తారు. ఇక మే 27న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ (ఎలిమినేటర్ గేమ్ లో గెలుపొందిన జట్టు వర్సెస్ క్వాలిఫైయర్ 1 లో ఓటమి పొందిన జట్టు) జరగాల్సి ఉంది. ఇక మే 29న అదే స్టేడియంలో క్వాలిఫైయర్ 1 విజేత, క్వాలిఫైయర్ 2 విజేతల మధ్య ఫైనల్ జరుగుతుంది.


Click it and Unblock the Notifications












